హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సి) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై మీడియా కథనాలను ఎన్హెచ్ఆర్సి సుమోటాగా స్వీకరించింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషికి ఎన్హెచ్ఆర్సి నోటీసులు పంపింది. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాధిత కుటుంబాలకు అందించిన సాయం వివరాలు తమకు తెలియజేయాలని పేర్కొంది.
ఆత్మహత్యలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలనీ, బాధిత కుటుంబాలకు తగిన ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలనీ ఎన్హెచ్ఆర్సి ఆదేశించింది. ఇది తలదించుకోవాల్సిన ఘటనని ఎన్హెచ్ఆర్సి పేర్కొంది. భవిష్యత్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించింది.
మీడియా లేవనెత్తిన అంశాలు నిజమైతే పొరపాట్లకు కారణమైన అధికారులు మానవహక్కులు ఉల్లంఘించినట్లేనని వ్యాఖ్యానించింది.