దేశ వ్యాప్తంగా ఇవేళ 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళి సై సౌందరాజన్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ముందుగా పరేడ్ గ్రౌండ్ లో అమర జవాన్లకు నివాళులర్పించారు. సైనికుల గౌరవవందనం స్వీకరించారు గవర్నర్. వివిధ రంగాల్లో ప్రముఖులకు గవర్నర్ సత్కరించి అవార్డులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి, డీజీపీ అంజనీకుమార్ పలువురు ఉన్నతాధికారులు హజరైయ్యారు.
ఈ సందర్భంగా నా ప్రియమైన తెలంగాణ అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన గవర్నర్ తమిళి సై.. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నర్ తమిళి సై తన ప్రసంగంలో సీఎం కేసిఆర్ ను పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తెలంగాణకు విశిష్టమైన చరిత్ర ఉందనీ, రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. వైద్య, ఐటీ రంగాల్లో హైదరాబద్ కు ప్రత్యేక గుర్తింపు ఉందనీ, దేశంలోని అన్ని నగరాలకు హైదరాబాద్ తో కనెక్టివిటీ ఉందని పేర్కొన్నారు. గిరిజనుల్లో పోషకాహార సమస్యల నివారణకు కృషి చేస్తున్నామన్నారు. రాజ్ భవన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించామనీ తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సహకారాన్ని రాజ్ భవన్ అందిస్తొందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలు ఆత్మస్థైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం.. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అంటూ పిలుపు నిచ్చారు. కొంత మందికి తాను నచ్చకపోవచ్చు కానీ తనకు తెలంగాణ ప్రజలంటే ఇష్టమని గవర్నర్ తమిళిసై అన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ అభివృద్ధిలో తన పాత్ర తప్పక ఉంటుందన్నారు. “అభివృద్ధి అంటే భవనాల నిర్మాణాలు కాదు.. జాతి నిర్మాణం. ఫామ్ హౌస్ లు కట్టడం మాత్రమే అభివృద్ధి కాదు. మన పిల్లలు విదేశాల్లో చదవడం అభివృద్ధి కాదు- రాష్ట్ర విద్యాలయాల్లో అంతర్జాతీయ సౌకర్యాలు ఉండాలి” అంటూ గవర్నర్ తమిళి సై పరోక్షంగా కేసిఆర్ సర్కార్ ను ఉద్దేశించి సెటైర్ లు వేశారు. తెలంగాణతో తనకు ఉన్న బంధం మూడేళ్లు కాదనీ, పుట్టుకతోనే బంధం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసిఆర్ సహా మంత్రులు ఎవరూ హజరుకాలేదు. కీరవాణి, చంద్రబోస్, బాలలత, ఆకుల శ్రీజల తదితరులను గవర్నర్ సత్కరించారు.