ఢిల్లీ, జనవరి 16: ఇప్పటి వరకు ‘ఆప్’తో చర్చలు జరగలేదు, రానున్న రోజుల్లో ఎమి జరుగుతుంతో వేచి చూడాలి అని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ అన్నారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షురాలిగా నేడు ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే విషయంపై ఆప్ అధినేత కేజ్రీవాల్తో ఇప్పటి వరకూ చర్చలు జరగలేదని అన్నారు. రాజకీయాలు పూర్తిగా సవాళ్లతో కూడుకున్నవని ఆమె చెప్పారు.
బిజెపి, ఆప్ రెండు తమ పార్టీకి ప్రస్తుతం ప్రత్యర్థులేనని ఆమె అన్నారు. ఢిల్లీ పిసిసి అధ్యక్షురాలిగా షీలాదీక్షిత్ బాధ్యతలు స్వీకరించడంతో ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తుకు మార్గం సుగమయినట్లేనని ఆయా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆప్తో పొత్తును సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ మాకెన్ వ్యతిరేకించారు. తదుపరి పరిణామ క్రమంలో ఆతని స్థానంలో షీలాదీక్షిత్ను పిసిసి అధ్యక్షురాలిగా పార్టీ అధిష్టానం నియమించింది.