వైసీపీతో కలిస్తే బీజేపీతో కటీఫ్…!
అమరవతిపై హామీతోనే బీజేపీతో దోస్తీ…!
అమరావతి ఒక్క అంగుళం కూడా కదలదు..!
జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేయం…!
సీఏఏ, ఎన్ఆర్సి వలన ఎవరికీ నష్టం ఉండదు…!
ఈ మాటలన్నీ వింటుంటే ఎవరన్నారు అనేది టపీమని గుర్తుకొచ్చేస్తుంది. ప్రత్యేకంగా పేరు చెప్పాల్సిన అవసరం లేదు. విరామం లేని పర్యటనలు, సమావేశాలు… మధ్యలో సినిమాలతో యమా బిజీ అయిపోయారు పవన్ కళ్యాణ్. తాను పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిని అని నిరూపించుకోడానికి నానాపాట్లు పడుతున్నారు. ఈ పాట్లులోనే నిలకడలేమి, అపరిపక్వత, రాజకీయ అజ్ఞానం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.
ఇప్పుడేమీ సార్వత్రిక ఎన్నికల్లేవు. కానీ బీజేపీతో పొత్తు అని ముందుకు వెళ్లారు. చర్చించుకున్నారు. కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఆ ఇరు పార్టీల ఉమ్మడి అజెండా అమలు చేయడంలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి. రెండు పార్టీలు కలిసి నడవాలని నిర్ణయించుకున్న రోజునే ఢిల్లీ వేదికగానే చేసిన పెద్ద కార్యక్రమం వాయిదా పడింది. అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా ఫిబ్రవరి 2 న తాడేపల్లి నుండి కృష్ణానది వంతెనపై భారీగా ర్యాలీ చేస్తామని ఇరు పార్టీల ప్రతినిధులు ప్రకటించారు, కానీ అది జరగలేదు. నాటి నుండి వారి ఉమ్మడి అజెండా అమలు చేయలేదు. మళ్ళీ కలవలేదు. దానికి కారణాలున్నాయి. కాస్త లోతుగా వెళదాం రండి…. “కేంద్రం అంటే ఏ పార్టీ..? బిజెపి. అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు అని పదే పదే చెప్తున్న పార్టీ ఏది…? బిజెపి. కానీ “అమరవతిపై వైసీపీ ఏకపక్షంగా వెళ్తుంది.”
“రాజధానిపై జగన్ వి తుగ్లక్ చర్యలు”. “అమరావతి అంగుళం కూడా కదలదు”. “కేంద్రం అన్ని చూస్తుంది. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుంది”. అంటూ ఇక్కడ పదే పదే మాట్లాడుతున్నది బీజేపీ నాయకులే. ఇక్కడే ఉంది అసలు విషయమంతా. బీజేపీ చేసేదేం లేదు. కేవలం మాటలేనని. పెద్దలు కనుసైగల్లో ఏదైనా జరగాల్సిందే. నిజానికి రాజ్యాంగబద్ధంగా రాష్ట్రంలో రాజధానిపై సర్వ హక్కులూ రాష్ట్ర ప్రభుత్వానివే. కానీ ఇప్పటి రాజకీయాల్లో రాజ్యాంగంలోని ఆర్టికళ్ళు కంటే రాజకీయ నిర్ణయాలకు పెద్ద విలువ ఉంటుంది. అందుకే కేంద్ర పెద్దలు రాజకీయంగా దీన్నీ చూసి కన్నెర్ర చేస్తే రాజధాని ప్రక్రియ నిలిచిపోతుంది. కానీ కేంద్రంలో రాజధాని విషయంలో చూసీ, చూడనట్టు ఉంటున్నారు. పైగా జగన్ కి ఇప్పుడున్న ప్రజాదరణ నేపథ్యంలో కాస్త సానుకూలంగానే ఉన్నారు. అందుకే రాజధానిపై పోరాటంలో ఇక్కడి బిజెపి నాయకులు నాలుగు మాటలు తప్ప, చేతల్లో ఏమి చేయలేరు. అందుకే వారు ప్రత్యక్షంగా కార్యక్రమాలకి దిగడం లేదు. పాపం ఈ పోరాటంలో పవన్ ఒంటరయ్యారు. ర్యాలీ జరగలేదు, తదుపరి కార్యక్రమాలు రూపకల్పన జరగలేదు. కానీ పవన్ మాత్రం నిత్యం నిలకడ లేకుండానే… “రాజధానిపై హామీ ఉంది. అందుకే బీజేపీతో దోస్తీ కట్టాను” అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక్కడ బిజెపి పరిస్థితే పవన్ కళ్యాణ్ ది కూడా. మాటలు తప్ప ప్రత్యక్ష కార్యక్రమాలు, పోరాటాలు ఏమి లేవు. వారానికోసారి రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతుల్లో ఉద్రేకం, ఉద్వేగం కలిగేలా నాలుగు మాటలు చెప్పి వచ్చేయడమే పవన్ కి పనిగా మారింది.
ఇక రెండు రోజులుగా పవన్ అందుకుంటున్న కొత్తరాగం వైసీపీతో బిజెపి కలిస్తే తాను బిజెపికి దూరమవుతానని. జాతీయపార్టీలు ఎప్పుడూ రాష్ట్రాల్లో అవకాశాలను వెతుక్కుంటాయి. తమకు నేరుగా జనబలం లేని పక్షంలో జనబలం ఉన్న నాయకులను అక్కున చేర్చుకుంటాయి. ప్రస్తుతం ఏపీలో జనబలం మెండుగా ఉన్నది వైసీపీకే. నిజానికి దక్షిణ భారతంలో బలపడాలని అనుకుంటున్న బిజెపికి ఒడిశా, తమిళనాడు, ఏపీ కొరకరాని కొయ్యగా మారాయి. అందుకే ఒడిశాలో నవీన్ పట్నాయక్ తో బాగానే ఉంటున్నారు. ఇక తమిళనాడులో డీఎమ్ కె , ఏపీలో వైసిపి అవసరం బిజెపికి ఉంది. రాజ్యసభలో బలం కోసం, దక్షిణాన బలం కోసం బిజెపికి ఇది తప్పదు. అందుకే జగన్ తీసుకునే నిర్ణయాలను కేంద్రం చూసీ చూడనట్టు ఉంటూనే, కాస్త సానుకూలంగానే వెళ్తుంది. ఈ దశలో కేంద్రంలో వైసీపీ నేరుగా చేరినా, చేరకున్నా మైత్రి మాత్రం కొనసాగుతుంది. ఎన్నికలకు ముందు తమను తీవ్రంగా వ్యతిరేకించి, విమర్శలు గుప్పించిన చంద్రబాబుని ఒంటరి చేసే క్రమంలో బిజెపి అటు పవన్, ఇటు జగన్ ని అక్కున చేర్చుకున్నా ఆశ్చర్యం లేదు. కొన్నేళ్ల పాటు జగన్ తో దోస్తీగా ఉంటూ… రాజ్యసభలో కాస్త బలపడి.. వచ్చే ఎన్నికల సమయానికి ఏపీలో వైసిపి వర్సస్ బిజెపి- జనసేన గా మార్చాలని బిజెపి పెద్దల ఆలోచన కావచ్చు. ఇదేమి పవన్ కి తట్టక జగన్ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, బిజెపి అంటే రాష్ట్రంలో తనే అన్నట్టుగా మాట్లాడుతూ, కేంద్రం తన మాట వింటుంది అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఎన్ని చెప్పినా క్షేత్ర స్థాయిలో జనానికి…, కేంద్రంలో పెద్దలకు తెలుసు… ఎప్పుడు ఏం చేయాలో…! అందుకే పవన్ కి బీజేపీతో పొత్తు కాషాయమో.., కషాయమో అర్ధం కాని స్థితిలో జనసైనికులు ఉన్నారు. సగటు రాజకీయ అభిమానులూ మాత్రం కాస్త క్లారిటీతోనే ఉన్నారు.
– శ్రీనివాస్ మానెం