చంద్రబాబు రాజకీయాన్ని కరోనా ముందు, కరోనా తర్వాతా అని విభజించాల్సిన పరిస్థితి ఏర్పడిందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్న దశ ఇది! ఎలాంటి బాబు ఎలా అయిపోయారు? అసెంబ్లీలోనూ, బయటా మహా మహులను ఎదుర్కొన్న బాబు.. ఎన్నో క్లిష్ట పరిస్థితులనుంచి గట్టేక్కిన బాబు.. నేడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? గతంలో ఏన్నాడూ ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడనట్లు మాట్లాడిన బాబు.. నేడు వరుసగా కరోనా పేరుచెప్పి రెండు నెలలకు పైగా రెస్ట్ తీసుకున్నా కూడా ఇప్పటికీ జనాలను పట్టించుకోవడం లేదు ఎందుకు? ఇంత దారుణంగా కాకపోయినా అధికారం పోవడం, ప్రతిపక్షంలో కూర్చోవడం బాబుకు కొత్తేమీ కాదు కదా.. మరి ఇప్పుడే ఎందుకిలా? తమ్ముళ్లలో వేదన కలిగిస్తున్న ప్రశ్నలివి!
ఈస్థాయిలో బాబు అభిమానులకు ఆవేదన కలిగించిన సంఘటన… తాజాగా అమరావతి నుంచి బాబు నేరుగా హైదరాబాద్ కి వెళ్లడమే! అవును… కరోనా పేరుచెప్పి సుధీర్ఘ విశ్రాంతి తీసుకున్న బాబు.. ఏపీ డీజీపికి విశాఖ వెళ్తానని చెప్పి అనుమతి తీసుకున్నారు. అనంతరం అమరావతికి వచ్చి ఆన్ లైన్ లో మహానాడు నిర్వహించుకున్నారు. తర్వాత కచ్చితంగా విశాఖకు వెళ్తారు అనే అంతా భావించారు! విశాఖ ఎమ్మెల్యేలు అయితే.. బాబొస్తున్నారంటూ కాస్త హడావిడి కూడా చేశారు! మహానాడులో విశాఖ ఎల్జీపాలిమర్స్ మృతుల కుటుంబాలకు రూ. 50వేలు ప్రకటించగానే.. బాబు విశాఖ వెళ్తారని కన్ ఫాం చేసుకున్నారు. కానీ… ఇంతలోనే తమ్ముళ్లకు నిరాశ ఎదురైంది!
అధికారంపోవడం అత్యంత సహజం. అయినా కానీ బాబుకు 2019 సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు రాకపోయినా 38.5శాతం ఓట్లు వచ్చాయి! ఈ నెంబర్ చాలు బాబు ఉత్సాహంగా పనిచేయడానికి. కానీ… బాబు మాత్రం సీట్లు ఇచ్చిన విషాదాన్నే తలచుకుంటున్నారు తప్ప, ఓట్లు ఇచ్చిన ఉత్సాహాన్ని మరిచిపోతున్నారు. 2014లో చంద్రబాబు.. మోడీ – పవన్ లతో కలిసి జట్టుగా పోటీచేసినా వచ్చింది 43.53% ఓట్లే! అప్పుడు జగన్ తొలిసారి ఒంటరిపోరుకు దిగినప్పుడు వచ్చింది 42.88% ఓట్లు! దాంతో పోలిస్తే.. 2019 లో ఒంటరిగా పోటీచేసినప్పుడు వచ్చింది తక్కువేమీ కాదు! కాకపోతే బాబుకి కేవలం ఎమ్మెల్యే సీట్లు, తద్వారా వచ్చే అధికారం పై యావ మాత్రమే అధికంగా ఉండటం వల్ల.. ఓట్లేసిన ప్రజల అభిప్రాయానికి ఆయన అంతగా విలువ ఇవ్వడం లేదని అంటున్నారు విశ్లేషకులు!
సీట్లు రాకపోవడం, అధికారం అందకపోవడం అన్న సంగతులు కాసేపు పక్కనపెడితే… తనకు అధికారం వచ్చినప్పుడు 2014 – 43.53% ఓట్లు రాగా, 2019 – 38.5% ఓట్లతోనే ప్రతిపక్షంలో కూర్చున్నారు! ఈ లెక్కన చూసుకుంటే బాబుని ఇంకా ప్రజలు నమ్మినట్లే లెక్క! కానీ.. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా కూడా తన ప్రతిపక్ష పాత్రను నిర్మాణాత్మకంగా పోషించడంలో.. తనను నమ్మి ఓట్లేసిన కోటి ఇరవై మూడు లక్షల ఓటర్లను పట్టించుకోవడంలో బాబు పూర్తిగా విఫలమయ్యారనే చెప్పుకోవాలి! ఈ ప్రవర్తనతోనే 23మందిని కాస్త 20కి తెచ్చుకున్నారని, అనంతరం 18కి పాడేసుకునేలా ఉన్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి! ఏది ఏమైనా… ఇకనైనా అమరావతి – హైదరాబాద్ కు షెటిల్ సర్వీసులు మానేసి, పూర్తిగా రాహ్ట్ర సమస్యలపైనా.. తనను నమ్మి ఓట్లేసిన 38.5% శాతం ప్రజల అభిప్రాయాలపైనా పనిచేయాలని తమ్ముళ్లు కోరుకుంటున్నారు.
ఈ విషయాలు మరిచిన బాబు… ఇంతవరకూ జరిగిన వ్యవహారాలను కరోనాపైకి నెట్టేసినా, ఇకనైనా కాస్త జాగ్రత్తగా ప్రజల తరుపున పోరాడితే, ప్రజల అభిష్టం మేరకు నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తే రాబోయే కాలంలో “2019 < 2024” అయ్యే అవకాశాలు ఉన్నాయని.. అలాకాని పక్షంలో “2019 > 2024” అయ్యే ప్రమాధం ఉందన్ని పలువురు హెచ్చరిస్తున్నారు! మరి బాబు ఆ దిశగా ఆలోచిస్తారా లేక కృష్ణా రామా అనే వయసులో జగన్ తో అవసరమా అనుకుంటారా అనేది వేచి చూడాలి!