ముఖ్యమంత్రికి, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న నరసాపురం వైసిపి ఎంపీ రఘురామకృష్ణం రాజు సస్పెన్షన్కు రంగం సిద్ధమైనట్లు ఉన్నత స్థాయి పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.రఘురామకృష్ణంరాజు వైఖరి పట్ల జగన్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారంటున్నారు.
పైగా ఆదిలోనే ఇలాంటి అసమ్మతిని పనిచేయకపోతే అది మరికొందరి ద్వారా వ్యాపించే ప్రమాదం ఉంటుందన్న అంచనాతో రఘురామకృష్ణంరాజు పై వేటుకు వేటుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నది ఆ వర్గాల కథనం.అయితే రఘురామకృష్ణంరాజు మాత్రం ఏమాత్రం వెనకంజ వేయకుండా ఇంకా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.ముఖ్యమంత్రి చుట్టూ ఒక కోటరీ ఏర్పడిందని ఆయన ఇంకో ఆరోపణ చేశారు.వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్నారెడ్డి, విజయ సాయిలతో పాటు ఓ అధికారి వల్ల సీఎం కి దగ్గర కాలేకపోతున్నామని తెలిపారు.
అ కోటరీ తన లాంటి వారిని సీఎం దగ్గరకు రానివ్వడం లేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఇద్దరు ముగ్గురు ఎంపీలను తప్ప మిగతా వారిని సీఎం కూడా కలవడం లేదని ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.22మందిలో ఎంత మందిని సీఎం కలుసుకున్నారని ప్రశ్నించారు..సీఎం అంటే నాకు అత్యంత గౌరవం అని చెప్పారు. సీఎం ని నేరుగా కలిసే అవకాశం లేక మీడియా ద్వారా చెప్పాల్సి వచ్చిందని రఘురామకృష్ణంరాజు తెలపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు .టీటీడీ విషయంలో భక్తుడిగానే తాను స్పందించానని చెప్పారు. ఇసుక కొరత తీవ్రంగా ఉందని, 16వేలకు ధర పెరిగిందని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో కోర్టు తీర్పులే తాను ఉదహరించానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చే వరకు వేచి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.రమేష్ కుమార్ ని అభిశంసన చేసి ఉండాల్సిందని, ఎన్నికల సంస్కరణ అని చెబుతూ దుర్భాషలు ఆడటాన్ని ఆయన తప్పుపట్టారు. రమేష్ కుమార్ విషయంలో సీఎంని అందరూ తప్పు దోవ పట్టించారన్నారు.
తన నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా జరిగిన కొన్ని విషయాలను కూడా రఘురామరాజు బయటపెట్టారు. మాజీ ఎంపీ గంగరాజు కొడుకు రంగరాజుని తనకు మాట మాత్రం చెప్పకుండా వైసీపీ లోకి తెచ్చి పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు చేశారన్నారు. బీజేపీ నాయకుడి కొడుకుని వైసీపీలోకి తెచ్చారన్నారు.సీఎం మాత్రమే తమ నాయకుడు, ఆయనకు మాత్రమే జవాబుదారీగా ఉంటానని రఘురామ కృష్ణంరాజు చెప్పారు.తాను వైసీపీ నుండి సస్పెండ్ కావాలని కోరుకోవడం లేదని ఒకవేళ పార్టీ అధిష్టానం ఆ విధంగా నిర్ణయిస్తే తానేమీ చేయలేనని కూడా ఆయన చెప్పారు.ఈ ఇంటర్వ్యూలో రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసే విధంగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు