Chandrababu Case: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబుకు గృహ నిర్బంధం (హౌస్ రిమాండ్) ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా పిటిషన్ వేశారు.
చంద్రబాబు కేసు వాదన కోసం సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అయిన సిద్ధార్ధ లూద్రా ప్రత్యేకంగా విజయవాడ వచ్చారు. చంద్రబాబుకు జైలులో పటిష్ట భద్రత, రక్షణ ఉండదని ఆయన వాదించగా, ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కౌంటర్ దాఖలు చేశారు. దీంతో ఇరువర్గాల వాదనలకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు మరుసటి రోజుకు వాయిదా వేశారు.
ఇదే క్రమంలో చంద్రబాబు తరపున మరో పిటిషన్ ను కోర్టులో దాఖలు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి పూర్తి డాక్యుమెంట్లు పరిశీలన కోసం సెక్షన్ 207 సీఆర్పీసీ కింద అనుమతి ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ దాఖలు చేసిన వెంటనే వాదనలు వినిపించేందుకు సిద్ధార్ధ లూథ్రా ప్రయత్నించడంతో న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు.
వరుసగా పిటిషన్ లు వేయడం, సమయం ఇవ్వకుండా ఆ వెంటనే వాదనలు వినిపించడం ఏమిటంటూ చంద్రబాబు తరుపు న్యాయవాదులపై ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయమూర్తి. వరుసగా పిటిషన్ లు వేయడం వల్ల కోర్టు సమయం వృధా అవుతుందన్నారు. ఒక పిటిషన్ పై ఆర్డర్ ఇచ్చే సమయంలోనే మరో పిటిషన్ వేయడంపై అసహనం వ్యక్తం చేశారు.
ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు సంబంధించి రిమాండ్ ఉత్తర్వులపైనా, హౌస్ రిమాండ్ పిటిషన్ పైనా వాద ప్రతివాదనలు వాడివేడిగా జరిగినా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏసీబీ కోర్టులో తీర్పులు వెలువడ్డాయి. సీఐడీ వాదనలకే ఏసీబీ కోర్టు ఏకీభవించింది. కేసులో చంద్రబాబుపై అభియోగాలు బలంగా ఉన్నందున ఆయన ఎంత పెద్ద లాయర్ ను తీసుకువచ్చి వాదనలు వినిపించినా ఉపయోగం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు చేసిన హడావుడి న్యాయమూర్తికే ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు. చంద్రబాబు అవినీతి పాల్పడలేదన్న వాదనలు చెప్పకుండా సీఐడీ అరెస్టు విధానం తప్పు అంటూ వాదనలు చేయడం విడ్డూరంగా ఉందని వైసీపీ నేతలు అంటున్నారు.
Breaking: ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు మరో సారి చుక్కెదురు .. హౌస్ రిమాండ్ పిటిషన్ తిరస్కరణ