Chandrababu ACB Court: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసాయి. చంద్రబాబు తరుపున సుప్రీం కోర్టు న్యాయమూర్తి ప్రమోద్ కుమార్ దూబే, సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు ముగిసిన అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు.
చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై గురువారమే చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు పూర్తి కాగా, సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మరి కొన్ని వాదనలు వినిపిస్తామని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ఈరోజు ఆయన మరి కొన్ని అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. చంద్రబాబు కుట్రపూరిత నేరానికి పాల్పడ్డారన్నారు. ముఖ్యమంత్రి హోదాను అడ్డు పెట్టుకుని షెల్ కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాకి నిధులు మళ్లించారని ఏఏజీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. జీవో నెం.4 ని అడ్డం పెట్టుకుని నిధులు మళ్లించారన్నారు. స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ ఆడిటర్ వెంకటేశ్వర్లును విచారించాల్సి ఉందన్నారు. ఆడిటర్ వెంకటేశ్వర్లు స్కిల్ కార్పోరేషన్ కు ఆడిటర్ గా పని చేశారన్నారు.
ఈ నెల 10వ తేదీ సీఐడీ విచారణకు రావాలని ఆడిటర్ వెంకటేశ్వర్లుకి నోటీసులు ఇచ్చామన్నారు. టీడీపీకి, స్కిల్ కార్పోరేషన్ కు వెంకటేశ్వర్లు ఒక్కరే ఆడిటర్ కావడంతో నిధుల దారి మళ్లింపు బయటపడకుండా మేనేజ్ చేశారన్నారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వద్దనీ, బెయిల్ ఇస్తే ఆడిటర్ వెంకటేశ్వర్లును మేనేజ్ చేస్తారని ఏఏజీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. చంద్రబాబుకి ఈ కేసులో సెక్షన్ 409 వర్తిస్తుందని కాబట్టి బెయిల్ ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని కోరారు. అనంతరం చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్ పై విచారణ జరిగింది. కస్టడీ పిటిషన్ పై ఇరువురు న్యాయవాదుల వాదనలు హోరాహోరీగా జరిగాయి.
చంద్రబాబును అయిదు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఏఏజీ కోరారు. ఆయన బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకోవాలన్నారు. ఇప్పటికే ఆదాయపన్ను వివరాలు తీసుకున్నామన్నారు. సీఐడీ అధికారులు విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. వాటిలో చంద్రబాబు పాత్ర, ఇతరులకు డబ్బు పంపిణీ అంశాలపై విచారణ చేయాలని అన్నారు. అందుకే అయిదు రోజుల కస్టడీ కోరుతున్నామన్నారు. కస్టడీకి ఇవ్వాలన్న ఏఏజీ వాదనలపై చంద్రబాబు తరపు న్యాయవాది దూబే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు రోజులు కస్టడీకి తీసుకుని విచారించారన్నారు. విచారణకు చంద్రబాబు సహకరించారని కోర్టుకు వివరించారు.
కస్టడీ ముగిసినా ఇప్పటి వరకూ కేసు డైరీ సమర్పించలేదని దూబే వాదించారు. దీంతో కేసు డైరీ ఎక్కడ ఉందని సీఐడీ అధికారులను న్యాయమూర్తి అడిగారు. ఇప్పటికే ఒక సారి చంద్రబాబు ను పోలీసులు కస్టడీకి ఇచ్చారనీ, రెండో సారి ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయవాది దూబే కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. స్కిల్ స్కామ్ లో అరెస్టయిన 13 మందికి ఇప్పటికే బెయిల్ వచ్చిందన్నారు. ఈ కేసులో విడుదల అయిన నిధులకు సీఎంగా పని చేసిన చంద్రబాబుకు సంబంధం లేదన్నారు. అరెస్టు అయన 15 రోజుల తర్వాత కస్టడీ అడగడం సరికాదన్నారు. తెలుగుదేశం అకౌంట్లలో జమ అయిన మొత్తం పార్టీకి వచ్చిన విరాళాలు అని, ఆ డబ్బుతో చంద్రబాబుకు సంబంధం లేదని దూబే పేర్కొన్నారు.
చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై గత మూడు రోజులుగా ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతుండగా, ఏ రోజుకారోజు వాదనలు ముగిసి తీర్పు వస్తుందని ఆశిస్తుండగా, వాదనలు ముగిసిన తర్వాత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేయడంతో సస్పెన్స్ కొనసాగుతోంది. తీర్పును సోమవారం వెల్లడిస్తామని వెల్లడించడంతో చంద్రబాబుకు బెయిల్ ఇస్తారా లేక కస్టడీ ఇస్తారా అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.