Madhav Video Viral: ఈ నెల 18న ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల కీలక భేటీ జరగనున్నది. ఈ భేటీకి సంబంధించి అటు జాతీయ మీడియాలో, ఇటు ఏపిలో టీడీపీ, అకాళీదళ్ తదితర పాత మిత్ర పక్షాలకు ఆహ్వానం అందింది అంటూ కథనాలు నిన్న సాయంత్రం నుండి వస్తున్నాయి. అయితే టీడీపీ అనుకూల మీడియాలో ఎన్డీఏ కీలక సమావేశానికి టీడీపీ అహ్వానం అందిందని, అయితే ఈ సమావేశానికి హజరు కావాలా లేదా అన్నది ఆ పార్టీ అధికారికంగా వెల్లడించలేదంటూ పేర్కొంటున్నాయి. మరో పక్క ఎన్డీఏ సమావేశానికి అహ్వానం వచ్చిందా లేదా అన్నదానిపైనా ఆ పార్టీ నుండి ఎటువంటి ప్రకటన లేదు. కానీ జరుగుతున్న ప్రచారంపై ఏపీ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ స్పందించారు.
ఎన్డీఏ కూటమికి టీడీపీకి అహ్వానం అంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఎన్డీఏ కూటమికి టీడీపీని అహ్వానించలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కూటమిలో ఉన్న పార్టీలకు మాత్రమే ఆహ్వానం పంపించామని తెలిపారు. 2017లోనే ఎన్డీఏ కూటమి నుండి టీడీపీ బయటకు వెళ్లిందని అన్నారు. ప్రస్తుతం ఏపీలో తమ పొత్తు జనసేనతోనేనని ఆయన పేర్కొన్నారు. టీడీపీతో పొత్తుపై తుది నిర్ణయం పార్టీ అధిష్టానందేనని తెలిపారు. దివంగత నేత, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరికి ఏపి పగ్గాలు అప్పగించిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ను కూడా బీజేపీలోకి అహ్వానిస్తుట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్కు పార్టీలోకి ఆహ్వానించలేదని మాధవ్ తెలిపారు.
మరో పక్క ఎన్డీఏ కూటమిలో చేరాలని వైసీపీకి అహ్వానం ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మాత్రం ఏ పార్టీతో పొత్తు లేకుండానే ఎన్నికల బరిలోకి వెళతామని స్పష్టం చేస్తున్నారు. ఎన్డీఏతో జత కడితే వైసీపీకి ఉన్న సంప్రదాయ ఓటింగ్ కు నష్టం జరుగుతోందని ఆ పార్టీ భావిస్తున్నదని అంటున్నారు. ఎన్డీఏ సమావేశానికి టీడీపీ ఆహ్వానమే లేదని మాధవ్ పేర్కొన్న వీడియో వైసీపీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.