Nara Lokesh: ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు మరో సారి నోటీసులు జారీ చేసింది. రెడ్ బుక్ వ్యవహారంలో ఆయనకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ తమను బెదిరిస్తున్నారని పేర్కొంటూ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు.
సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఉల్లంఘించిన కారణంగా లోకేష్ అరెస్టునకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేయగా, విచారించిన కోర్టు.. నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు లోకేష్ కు నోటీసులు ఇవ్వడానికి నిన్న (గురువారం) సీఐడీ అధికారులు ఇంటికి వెళ్లగా నేరుగా నోటీసులు తీసుకోకపోవడంతో ఇవేళ (శుక్రవారం) ఆయనకు వాట్సాప్ లో నోటీసులు పంపించారు. నోటీసులు అందుకున్నట్లు వాట్సాప్ లోనే సీఐడీకి ఆయన తిరిగి సమాధానం ఇచ్చారు.
యువగళం పాదయాత్ర ప్రారంభించినప్పటి నుండి నారా లోకేష్ ఓ రెడ్ బుక్ ను చూపుతూ.. తమ పార్టీ క్యాడర్ ను అక్రమంగా ఇబ్బందులు పెట్టిన పోలీసులు, అధికారుల పేర్లను ఈ బుక్ లో రాసుకుంటున్నాననీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ల పని పడతామని, వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
యువగళం సభల్లో తరచు రెడ్ బుక్ అంశాన్ని ప్రస్తావిస్తూ లోకేష్ మాట్లాడుతుండటంతో సీఐడీ అధికారులు తీవ్రంగా స్పందించారు. సీఐడీ నోటీసులపై ఆయన స్పందిస్తూ .. తాను మాట్లాడిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. తప్పు చేసిన అధికారులపైనే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరుపుతామని మాట్లాడానని సమర్ధించుకున్నారు. ఈ అంశంపై ఏసీబీ కోర్టులో ఏ విధంగా వివరణ ఇస్తారో చూడాలి మరి.
YS Jagan: పవన్, చంద్రబాబుపై మరింత ఘాటుగా సీఎం జగన్ విమర్శలు