AP CM Jagan: ఏపిలోని జగన్ సర్కార్కు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఇటీవల గ్రామ పంచాయతీల ఆమోదం, తీర్మానం లేకుండా కేంద్రం నుండి వచ్చిన 15వ ఆర్ధిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు తెలియకుండానే లాగేసుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు 14వ ఆర్ధిక సంఘం నిధులను విద్యుత్ బకాయిలకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. తాజాగా 15వ ఆర్ధిక సంఘం నిధులను తీసేసుకుంది. ఈ పరిణామంతో గ్రామ పంచాయతీ సర్పంచ్ లు ఖంగుతిన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు కేంద్రం నేరుగా విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బకాయిల పైరుతో తీసుకోవడంపై గ్రామాల్లోని ప్రజా ప్రతినిధులు మండిపడుతున్నారు. వారం రోజుల క్రితం 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.944 కోట్లను పంచాయతీ అకౌంట్ ల నుండి ఆర్ధిక శాఖకు మళ్లించుకున్నది. ఈ పరిణామంపై ఓ పక్క రాష్ట్రంలో పంచాయతీ సర్పంచ్ లు, వార్డు సభ్యులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క కేంద్రానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి.
Read More: AP Govt: సర్పంచ్లకు జగన్ సర్కార్ షాక్..! ఇచ్చిన హామీ నెరవేర్చలేదు..! ఉన్న డబ్బు ఊడ్చేశారు..!!
AP CM Jagan: ఆర్ధిక సంఘం నిధులకు ప్రత్యేక అకౌంట్
దీనిపై కేంద్రం సీరియస్ గా స్పందించి కీలక ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను పంచాయతీలకు తెలియకుండా ప్రభుత్వం తీసుకునే అవకాశం లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. ఆర్ధిక సంఘం నిధులు పంపేందుకు ప్రత్యేక అకౌంట్లను పంచాయతీల పేరిట ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఆదేశాలతో పంచాయతీరాజ్ కమిషనర్ అలర్ట్ అయ్యారు. దీనిపై జిల్లా పరిషత్ సీఈఓలు, డీపీఓలకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్ధిక సంఘం నిధులు ఇకపై ఆ అకౌంట్ లలో వేస్తామని ప్రభుత్వం పేర్కొన్నది. యూనియన్ బ్యాంకులో గ్రామ పంచాయతీల పేరు మీద అకౌంట్ లు ప్రారంభించాలని ఆదేశాలను జారీ చేశారు. అన్ని పంచాయతీలు వెంటనే అకౌంట్లు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.