CM YS Jagan: త్వరలో జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో నిరుపేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరగబోతుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. విజయవాడలోని విద్యాధరపురంలో వరుసగా అయిదవ ఏడాది వాహనమిత్ర నిధులను సీఎం జగన్ శుక్రవారం విడుదల చేశారు. వాహనమిత్ర పథకంతో ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు లబ్దిపొందుతుండగా, 2,75,931 మంది ఖాతాల్లోకి రూ.10వేల వంతున జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ ..99 శాతం హామీలు అమలు చేశామని తెలిపారు. ఒక వైపు పేదల ప్రభుత్వం ఉంటే మరో వైపు పేదలను మోసం చేసిన వారు ఉన్నారని విమర్శించారు.
మేనిఫెస్టోలో చెప్పింది చెప్పినట్లుగా తాము అమలు చేశామని అన్నారు. మేనిఫెస్టోను గత ప్రభుత్వం చెత్త బుట్టలో వేసిందని విమర్శించారు. లంచం, వివక్షతకు తావు లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. మీ ఇంట్లో మేలు జరిగి ఉంటేనే వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని జగన్ కోరారు. ప్రత్యర్ధులు అనేక రకాలుగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా ఇప్పటి వరకూ 1300 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పిన సీఎం జగన్.. వైఎస్ఆర్ వాహన మిత్ర అమలు చేస్తున్నందుకు తాను గర్వపడుతున్నానని తెలిపారు. పథకాన్ని అవినీతికి తావులేకుండా చేస్తున్నామని చెప్పారు. అమ్మఒడి, నేతన్న నేస్తం తదితర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించిన సీఎం జగన్ .. తమది పేదల కోసం పని చేస్తున్న ప్రభుత్వమని అన్నారు. గత ప్రభుత్వం ఇలాంటి పథకాలను అమలు చేసిందా అని జగన్ ప్రశ్నించారు. చిరు వ్యాపారులకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తొందని చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆ స్థలాల్లో ఇంటి నిర్మాణాలను చేపడుతున్నామని అన్నారు.
గతంలోనూ ఇదే బడ్జెట్, మారిందల్లా సీఎం ఒక్కరేననీ, గతంలో ఎందుకు ఈ పథకాలు ఇవ్వలేకపోయారని సీఎం జగన్ ప్రశ్నించారు. పేదవాడి ప్రభుత్వం నిలబడాలి, పెత్తందారుల ప్రభుత్వం రాకూడదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వీటన్నింటినీ గుర్తించి ఆలోచించాలని జగన్ సూచించారు. వాళ్లకు అధికారం కావాల్సింది దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికేనని విమర్శించారు. వాళ్లలాగా తనకు దత్తపుత్రుడు తోడు లేరనీ, వాళ్ల మాదిరిగా గజదొంగల ముఠా తోడుగా లేదనీ, దోచుకొని పంచుకొని తినడం తమ విధానం కాదని జగన్ స్పష్టం చేశారు.