AP High Court: టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై ఏపి హైకోర్టులో విచారణ జరిగింది. ప్రత్యేక అహ్వానితుల నియామకంపై గతంలో ఇచ్చిన స్టే కొనసాగుతుందని కోర్టు తెలిపింది. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కల్యాణదుర్గం టీడీపీ ఇన్ చార్జి ఉమామహేశ్వర నాయుడు పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో కేసు విచారణలో ఉండగా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని పిటిషనర్ తరపున న్యాయవాదులు బాలాజీ, అశ్వినీకుమార్ లు కోర్టుకు తెలిపారు. కోర్టు ఉత్తర్వులను అధిగమించేందుకే ఆర్డినెన్స్ తీసుకొచ్చారని, కోర్టు స్టే ఇచ్చాక ఇటువంటి ఆర్డినెన్స్ తీసుకురావడం సరికాదని న్యాయవాదులు పేర్కొన్నారు. దీంతో ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లను హైకోర్టు అనుమతించింది. ఆర్డినెన్స్ తీసుకొచ్చినా కోర్టు ఆదేశాలకు లోబడే ఉంటుందని తెలిపిన హైకోర్టు..విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.
AP High Court: ఆర్డినెన్స్ సవాాల్ చేస్తూ మరో పిటిషన్
టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోపై బీజేపీ నాయకుడు భానుప్రకాశ్ రెడ్డి మరొక పిటిషన్ దాఖలు చేశారు. 52 మందిని ప్రత్యేక అహ్వానితులుగా నియమించారని వారిలో కొంత మందికి నేర చరిత్ర కూడా ఉందని, ఇంత మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం కూడా సరికాదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ హైకోర్టులో విచారణ జరుగుతుండగానే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడంపై దాన్ని సవాల్ చేస్తూ మరో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.