AP High Court: ఏపి మూడు రాజధానుల అంశంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అమరావతి ప్రాంత రైతులు, వైసీపీ మినహా ఇతర రాజకీయ పక్షాలు కోర్టు తీర్పును స్వాగతిస్తుండగా, వైసీపీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరులు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. హైకోర్టు తీర్పుపై అమరావతి ప్రాంత రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నట్లు పేర్కోంటోంది. ఇదే విషయాన్ని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానంలో, నిర్ణయంలో ఎటువంటి మార్పులేదని ఆయన తెలియజేశారు.
Read More: AP High Court: రాజధాని అమరావతి కేసులో హైకోర్టు కీలక తీర్పు..రాష్ట్ర ప్రభుత్వానికి బిగ్ షాక్..
AP High Court: మోదుగుల తీవ్ర వ్యాఖ్యలు
ఈ తీర్పు నేపథ్యంలో న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ మధ్య పోరుకు, ఆధిపత్యానికి సవాల్ గా మారుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకు ముందు కూడా ఏపి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం న్యాయవ్యవస్థ పై తీవ్ర కామెంట్స్ చేశారు. చట్టాల విషయంలో శాసన వ్యవస్థే సూప్రీం అని దీనిలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడం తగదు అన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఆనాడు స్పీకర్ తమ్మినేని సీతారామ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అయ్యాయి. ఇప్పుడు అదే తరహాలో వైసీపీ మాజీ ఎంపి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
AP High Court: న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థలలో ఎవరు గొప్ప..?
రాష్ట్ర విభజనకు సంబంధించి పిటిషన్లు దాఖలు చేస్తే ఇంత వరకూ అవి విచారణకు రాలేదనీ, కోర్టులు తమకు అవసరం అయిన అంశాలపైనే దృష్టి సారిస్తున్నాయని వ్యాఖ్యానించారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నిక చెల్లదంటూ తాను 2019లో దాఖలు చేసిన పిటిషన్ ఇనాటికీ విచారణకు రాలేదని మోదుగుల ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థలలో ఎవరు గొప్ప దీనిపై పూర్తి స్థాయిలో చర్చ జరగాలన్నారు. శాసన సభ ఆమోదించిన విషయాలను కోర్టులు చెల్లవని చెప్పడం ఏంటి అని మోదుగుల ప్రశ్నించారు. పార్లమెంట్ సభ్యుడుగా చేసిన నాయకుడే ఈ విధంగా కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.