AP Skill Development Scam Case: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు ఏపీలో తీవ్ర సంచలనంగా మారింది. ఈ స్కామ్ పై సీఐడీ కొంత కాలంగా విచారణ జరుపుతోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అరెస్టు చేయడం చేయడం తీవ్ర సంచలనం అయ్యింది. ఇంతకు ముందు ఈ కేసులో పలువురుని సీఐడీ అరెస్టు చేసింది. ఈ కేసును ఈడీ కూడా దర్యాప్తు జరుపుతోంది. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడేనని ఏపీ సీఐడీ పేర్కొంది. స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ కేసులో మొదటి నుండి ఏమి జరిగింది. చంద్రబాబు పాత్ర ఏమిటి అనే విషయాలను ఒక సారి పరిశీలన చేస్తే..
చంద్రబాబు ప్రభుత్వ హాయంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ రూ.3300 కోట్లకు సీమెన్స్ సంస్థ – డిజైన్ టెక్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో ప్రభుత్వం పది శాతం నిధులు, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున పది శాతం వాటాగా జీఎస్టీ తో కలిపి రూ.370 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించింది. ప్రభుత్వం చెల్లించిన రూ.370 కోట్లలో రూ.240 కోట్ల రూపాయలు సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్ టెక్ సంస్థకు బదలాయించారంటూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. కేబినెట్ ను తప్పుదారి పట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరి కొన్ని పెట్టి డబ్బులు కాజేశారని అభియోగాలు ఉన్నాయి. దీనిపై గత కాలంగా లోతుగా విచారిస్తున్న సీఐడీ .. పలువురిపై కేసులు నమోదు చేసింది. ఈ వ్యవహారాన్ని ఈడీ దృష్టికి కూడా తీసుకువెళ్లగా వారు కూడా దర్యాప్తు చేస్తున్నారు.
దాదాపు 240 కోట్ల రుపాయలు షెల్ కంపెనీలకు మళ్లించినట్లుగా సీఐడీ గుర్తించింది. ఎలైట్ కంప్యూటర్స్, స్కిల్లర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, నాలెడ్జ్ పోడియం, ఈటీఏ – గ్రీన్, కేడన్స్ పార్టనర్స్ తదితర కంపెనీలకు నిధులు మళ్లించారు. నాడు సీమెన్స్ సంస్థ ఇండియా షెడ్ గా ఉన్న సుమన్ బోస్, డిజైన్ టెక్ సంస్థ ఎండీగా ఉన్న వికాస్ కన్వికర్ ద్వారా కుంభకోణం నడిపించినట్లు సీఐడీ విచారణలో వెలుగుచూసింది. వాస్తవానికి రూ.3300 కోట్ల ప్రాజెక్టుగా ఎండీయూ చేసుకున్న చంద్రబాబు సర్కార్ .. జీవోలో మాత్రం రూ.3300 కోట్ల ప్రస్తావన ను తొలగించింది. ఈ కుంభకోణం 2016 – 2018 మధ్య జరిగింది. దీనిపై గతంలోనే ఏసీబీకి పలువురు ఫిర్యాదు చేసారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఒప్పందానికి సంబంధించిన అసలు ఫైళ్లను మాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ అధికారుల దర్యాప్తులో అసలు కుట్ర బయటపడింది. దీంతో స్కామ్ పై కేంద్రం ఆదాయపన్ను శాఖ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ వ్యవహారంపై అప్పటికే విచారణ ప్రారంభించిన సీఐడీ అధికారులు ఈ సంస్థలన్నింటితో సీఐడీ అధికారులు కో ఆర్డినేట్ చేసి విచారణ జరిపారు.
మరోపక్క గ్లోబల్ సంస్థ సీమన్స్ ఇంటర్నెల్ టీమ్ కూడా తమ కంపెనీ పేరు మీద మోసాలకు పాల్పడ్డారని, తమకు ఎలాంటి సంబంధం లేదని పూర్తి ఆధారాలను సీఐడీకి ఇచ్చింది. ఈ కుంభకోణానికి సహకరించిన అనాటి అధికారులను కూడా కోర్టు ముందుకు వచ్చి స్టేట్ మెంట్ లు ఇచ్చారు. ఈ కేసులో ఏ 1 గా చంద్రబాబు, ఏ – 2 గా అచ్చెన్నాయుడు, ఉన్నారు. ఈ రోజు చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది. రెండు రోజుల క్రితం తనను రేపో మాపో అరెస్టు చేస్తారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన అనుమానించినట్లుగానే ఇవేళ చంద్రబాబును అరెస్టు చేయడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
Chandrababu: చంద్రబాబు ఊహించిందే జరిగింది.. చంద్రబాబును అరెస్టు చేసిన ఏపీ సీఐడీ