Bhuma Akhila Priya: రాష్ట్రంలో వైసీపీ ఆవిర్భావం అనంతరం రాయలసీమలో ఎక్కువగా నేతల వారసులు క్రియాశీల రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో గానీ టీడీపీలోగానీ ఎక్కువగా సీనియర్ నేతలే చక్రం తిప్పేవారు. క్రీయాశీల భూమిక పోషించేవారు. అయితే జగన్మోహనరెడ్డి నేతృత్వంలో వైసీపీ ఆవిర్భావం అయిన తరువాత యూత్ ట్రెండ్ వచ్చింది. భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయో అని ఆనాడు కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు వారి వారసులను వైసీపీలోకి చేర్పించారు. అన్న కాంగ్రెస్ పార్టీలో ఉంటే తమ్ముడు వైసీపీలో, తమ్ముడు కాంగ్రెస్ లో ఉంటే అన్న వైసీపీలో, అంతే కాకుండా ఒకే కుటుంబంలోని అన్న తమ్ములు వైసీపీ, టీడీపీలో ఇలా చాలా నియోజకవర్గాల్లో రాజకీయాలు చేయడం చూస్తునే ఉన్నాం. సీనియర్ నేతలు నియోజకవర్గంలో తమ ఆధిపత్యాన్ని కాపుడుకునేందుకు వారి వారసులనే రంగంలోకి దింపుతూ వస్తున్నారు.
టీడీపీ విషయానికి వస్తే జేసి దివాకరరెడ్డి ఆయన తనయుడిని, జేసి ప్రభాకరరరెడ్డి ఆయన తనయుడిని రాజకీయ వారసులుగా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విధంగా వైసీపీలోనూ నేతలు వారి వారసులను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. తాజాగా తీసుకువస్తున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ విషయానికి వస్తే భూమా ఫ్యామిలీ నుండి రాజకీయ వారసురాలిగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ , బ్రహ్మానందరెడ్డి, జగత్ విఖ్యాతరెడ్డిలు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. ఇదే నియోజకవర్గంలో భూమాకు ప్రత్యర్థి వర్గం అయిన గంగుల ఫ్యామిలీ నుండి వారసులు ఎంట్రీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా, ఎంపిగా కొనసాగి ప్రస్తుతం బీజేపీలో ఉన్న సీనియర్ నేత గంగుల ప్రతాప్ రెడ్డి కుమారుడు గంగుల ఫణికృష్ణారెడ్డి ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ అవుతున్నారు. ప్రతాప్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నా రాజకీయంగా పెద్దగా యాక్టివ్ గా లేరు. అయితే ఆయన సోదరుడు గంగుల ప్రభాకరరెడ్డి మాత్రం చాలా కాలం క్రితం వైసీపీలో చేరి యాక్టివ్ గా ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీగా ఉండగా ఆయన తనయుడు బిజేంద్ర నాధ్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో భూమా అఖిలప్రియపై బిజేంద్రనాధ్ రెడ్డి విజయం సాధించారు. కాగా గంగుల ప్రతాప్ రెడ్డి నియోజకవర్గంలో తన అధిపత్యాన్ని కొనసాగించేందుకు ఆయన తనయుడు ఫణికృష్ణారెడ్డిని వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ప్రతాప్ రెడ్డి సోదరుడు కుమారుడు బిజేంద్రనాధ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా కొత్తగా ఆయన కుమారుడు ఫణికృష్ణారెడ్డి వైసీపీలోకి ఎంట్రీ ఇస్తే రాబోయే ఎన్నికల సమయంలో ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యే టికెట్ కు అన్నదమ్ముల సవాల్ గా మారే అవకాశం ఉంది.
గంగుల ఫ్యామిలీలో చీలిక వల్ల భూమా ఫ్యామిలీకి అడ్వంటేజ్ అయ్యే అవుతుందనే మాటలు వినబడుతున్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గ రాజకీయాల్లో మొదటి నుండి గంగుల వర్సెస్ భూమా ఫ్యామిలీగా అన్న రీతిలో ఫైట్ జరుగుతుందనేది అందరికీ తెలిసిందే. ప్రస్తుతం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే బిజేంద్ర నాధ్ రెడ్డి కంటే అతని సోదరుడు ఫణికృష్ణ ఫ్లెక్సీలు, హంగామానే ఎక్కువగా కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల నాటికి గంగుల ప్రతాప్ రెడ్డి, ఆయన సోదరుడు ప్రభాకరరెడ్డిల కుమారులు ఫణికృష్ణారెడ్డి, బిజేంద్రనాధ్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే టికెట్ కు పోటీ పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అదే గనుక జరిగితే గంగుల ఫ్యామిలీ చీలిక రాజకీయాలు టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉండే భూమా అఖిలప్రియకు కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ అవకాశాలను భూమా అఖిలప్రియ ఏమేరకు సద్వినియోగం చేసుకుంటుందో వేచి చూడాలి.