Breaking: ఏపిలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. కొత్త జిల్లాలకు సంబంధించి తుది ప్రకటన వెలువడని నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటునకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఉగాది నాటి నుండి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది.
ఈ తరుణంలో ప్రభుత్వం జారీ చేసిన ముసాయిదా ప్రకటన రద్దు చేయాలంటూ గుంటూరు జిల్లా అప్పాపురం గ్రామానికి చెందిన దొంతినేని విజయ్ కుమార్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బి సిద్ధార్ధ, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన జాగర్లమూడి రామారావులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ముసాయిదా జీవోల అమలును నిలుపుదల చేస్తూ స్టే ఇవ్వాలని పిటిషన్లు కోరారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లాల హద్దులను నిర్ణయించారనీ, కాబట్టి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించనంత వరకు ఏపిలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండదని పిటిషన్ల తరపు న్యాయవాదాలు ధర్మాసనానికి వివరించారు. ఈ పిటిషన్ల పై హైకోర్టు ప్రధాన నాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.