Chandrababu: ఏపిలో పలు అసెంబ్లీ స్థానాలు టీడీపీకి ముప్పు తిప్పలు పెడుతున్నాయి. రాష్ట్రంలో 29 ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు ఉండగా వీటిలో టీడీపీ గెలుపు ఇబ్బందికరంగా మారింది. 2019 ఎన్నికల్లో ఈ 29 రిజర్వుడ్ నియోజకవర్గాల్లో కేవలం ఒకే ఒక స్థానాన్ని టీడీపీ గెలుచుకుంది. 2014 ఎన్నికల్లో ఆ 29 స్థానాల్లో 12 స్థానాలు టీడీపీ గెలుచుకోగా 2019 నాటికి ఒక స్థానానికి పరిమితం అయ్యింది. వచ్చే ఎన్నికల్లో 15 నుండి 18 స్థానాలు అయినా గెలుచుకోవాలని టీడీపీ ఆశిస్తొంది. ఇంతకూ ఆ 29 స్థానాలు ఏవి..టీడీపీ ఎక్కడెక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయి అనేది ఒక సారి పరిశీలిస్తే..
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Chandrababu: టీడీపీ కంచుకోటల్లోనూ వైసీపీ పాగా
రాష్ట్రంలో 29 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఉండగా, మరో ఏడు ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుండి వైసీపీకి సంపూర్ణ మద్దతు లభించడంతో 29 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఒకటి మినహా మిగిలిన అన్ని స్థానాల్లో వైసీపీ గెలుచుకుంది. ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్ధి ఒక్కరే విజయం సాధించారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నుండి అనంతపురం జిల్లా మడకశిర వరకూ ఉన్న ఈ 29 నియోజకవర్గాల్లో రాబోయే ఎన్నికల్లో కనీసం 15 నియోజకవర్గాల్లో అయినా గెలుచుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తొంది. ఈ నియోజకవర్గాలు టీడీపీ సవాల్ చేస్తున్నాయి. నెల్లూరు జిల్లా గూడూరులో టీడీపీ బలంగా ఉన్నా ఓడిపోతోంది. సూళ్లూరుపేట, సత్యవీడు ఇలా చాలా నియోజకవర్గాలు గతంలో టీడీపీకి కంచుకోటగా ఉన్నా ఆ తరువాత ఆ నియోజకవర్గాల్లో టీడీపీ ఓడిపోయింది. కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని చూసుకుంటే 2004 వరకూ వరుసగా టీడీపీ గెలుస్తూ వచ్చింది. 2004 ఎన్నికల్లో టీడీపీ తొలి సారి ఓడిపోయింది. ఆ తరువాత వరుసగా ఓడిపోతూనే ఉంది. అదే విధంగా వసంత నాగేశ్వరరావు, దివంగత దేవినేని రమణ, దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రులుగా ప్రాతినిథ్యం వహించిన కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ అయిన తరువాత వరుసగా తంగిరాల ప్రభాకరరావు, ఆయన మరణానంతరం ఆయన కుమార్తె తంగిరాల సౌమ్య గెలిచారు. 2019వరకూ ఈ నియోజకవర్గంలో టీడీపీ హవానే కొనసాగింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది.
రాబిన్ శర్మతో సర్వే
అయితే ఇప్పుడు టీడీపీ కొన్ని లెక్కలువేసుకుంటోంది. ప్రకాశం జిల్లా కొండెపితో పాటు అదే జిల్లాలో సంతనూలపాడు గెలుస్తామనే లెక్కల్లో ఉంది. అదే విధంగా గుంటూరు జిల్లా పత్తిపాడు, తాడికొండ, కృష్ణాజిల్లా తిరువూరు, పామర్రు గెలుచుకోగలమనే లెక్కలు వేసుకుంటోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి, కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో రెండు స్థానాల్లో గెలుస్తామని భావిస్తొంది. తూర్పు గోదావరి జిల్లా రాజోలు, అమలాపురం తదితర నియోజకవర్గాల్లో గెలుస్తామని అనుకుంటోంది. అయితే ఈ నియోజకవర్గాల్లో గెలుపునకు టీడీపీ ప్రత్యేక వ్యూహాలు ఏమైనా సిద్ధం చేసుకుంటుందా..? అనే విషయాలను పరిశీలిస్తే..టీడీపీకి రాబిన్ శర్మ స్ట్రాటజిస్ట్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన టీమ్ ఈ 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే మొదటి సారిగా రంగంలోకి దిగింది. ఈ నియోజకవర్గంలో సర్వే చేసింది. ఎవరైతే అభ్యర్ధులుగా ఉంటే బాగుంటుంది అనే దానిపై పార్టీకి రిపోర్టు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అంతర్గతంగా కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నుండి టికెట్ దక్కదు అనుకున్న వారు కొందరు టీడీపీలో చేరవచ్చు అన్న భావనలో కూడా ఉంది.
ఈ అయిదు జిల్లాలోని నియోజకవర్గాలపై ఫోకస్
ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాల్లోని రిజర్వుడ్ నియోజకవర్గాలతో పాటు విశాఖ జిల్లా పాయకారావుపేటపై టీడీపీ హోప్స్ పెట్టుకుంది. ఇది సాధ్యమవుతుందా..? లేదా అనేది చూడాలి. అయితే చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగి ఈ నియోజకవర్గాల్లో ఇన్ చార్జిలతో మాట్లాడుతూ అభ్యర్ధుల విషయంలో ఆచిచూసి వ్యవహరిస్తున్నారు. ఆర్ధికంగా స్థిరపడిన ఎన్ఆర్ఐలను తీసుకురావడం, కొంత మంది బాగా కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న వారిని తీసుకురావడం కోసం చూస్తున్నారుట. రిజర్వుడ్ నియోజకవర్గం కాబట్టి ఎవరో ఒకరిని నిలబెట్టి గెలిపించుకుంటాం, పెత్తనం తాము చేస్తాం అన్న వాళ్లను పక్కన బెట్టి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఉండి వాళ్లే రాజకీయం చేయాలి, వాళ్లే పెత్తనం చేసేటట్లుగా ఉన్న వాళ్లను రంగంలోకి దింపాలని చంద్రబాబు చూస్తున్నారుట. ఆ క్రమంలోనే ఈ 29 నియోజకవర్గాల్లో సగానికి పైగా అభ్యర్ధులను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది. ఏమి జరుగుతుంతో చూడాలి మరి.