ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో రసవత్తర పోరు జరుగుతోంది. ప్రస్తుతం ఎమ్మె ల్యేగా ఉన్న వైసీపీ నాయకుడు, సీనియర్ నేత ఫైర్ బ్రాండ్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఇక్కడ వైసీపీ అవకాశం ఇచ్చింది. మరోవైపు కూటమి పార్టీలైన టీడీపీ-జనసేన-బీజేపీల నుంచి టీడీపీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు పులవర్తి నాని(వెంకట మణి ప్రసాద్) బరిలో ఉన్నారు. ఇక, చిన్న చితకా పార్టీలైన కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీనివాసులు రంగంలోకి దిగారు.
వీరుకాకుండా.. నలుగురు ఇండిపెండెంట్లు కూడా పోటీ చేస్తున్నారు. దీంతో చంద్రగిరిలో గతంలో ఎన్న డూ లేనంతగా పోటీ నెలకొంది. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలు, అంచనా మేరకు.. ఇక్కడ నుంచిచెవిరెడ్డి మోహిత్కే గెలుపు అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అయితే.. 1985 తర్వాత.. ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కని టీడీపీని గెలిపించాలనేది నాని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ పార్టీకి అండగా ఉన్నారు.
అయితే.. నాని గెలుపు అంచలవరకు వస్తున్నా.. విజయం దక్కించుకోలేక పోతున్నారు. ఈ సారైనా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. జనసేన కార్యకర్తలు, నాయకు లను తన వెంట తిప్పుకొంటున్నారు. అదేసమయంలో చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో చెవిరెడ్డి దూకుడు ముందు పులవర్తి నాని బలమైన పోటీ ఇవ్వలేక పోతున్నారనే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందనే ఆవేదనలోనూ ఉన్నారు. నియోజకవర్గం పరంగా చూస్తే.. చెవిరెడ్డి రెండు సార్లు ఇక్కడ విజయం దక్కించుకున్నారు.
2019లో ఏకంగా 40 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ సాధించారు. నియోజకవర్గంలో భాస్కరరెడ్డికి తిరుగులేదనే మాట వినిపిస్తోంది. కరోనా సమయం నుంచి తర్వాత కూడా.. ఆయన ఇక్కడ ప్రజలకు తల్లోనాలుకగా ఉంటూ వచ్చారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీని వ్యతిరేకిస్తే.. ఇక్కడ మాత్రం వారు భాస్కరరెడ్డితోనే ఉండడం గమనార్హం. ఇది ఆయన వారసుడు మోహిత్కు కలిసివచ్చే అంశం గా మారింది. టీడీపీ గెలవాలన్న పట్టుదల ఉన్నా.. ఆ మేరకు హోంవర్క్ అయితే. సరైన పంథాలో ముందుకు సాగడం లేదన్నది వాస్తవం.