ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. త్వరలో పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం 11 గంటలకు ఎంపీలతో పార్లమెంటులో చర్చించాల్సిన విషయాలపై దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 29 నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి.
ఈ క్రమంలో వైసీపీ ఎంపీలతో ఈరోజు ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యి జరగబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో .. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టుకోవడానికి ఏ విధంగా పార్లమెంటులో గళం ఎత్తాలి అన్నదానిపై జగన్ ఫోకస్ పెట్టినట్లు టాక్.
అదే విధంగా విభజన హామీలు పూర్తిగా నెరవేరిన పరిస్థితులు లేని నేపథ్యంలో వాటిని కూడా పార్లమెంట్ వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించాలని వైసిపి ఎంపీలతో జగన్ చర్చించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే కేంద్రం కొత్తగా తెచ్చినా రైతు చట్టాల విషయంలో ఈ పార్లమెంట్ లో వైసీపీ వైఖరి ఏ విధంగా ఉంటుంది అన్నది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. గత కొన్ని నెలల నుండి జాతీయ వ్యాప్తంగా రైతులు కేంద్రం పై కొత్త చట్టాల విషయంలో మండి పడుతున్న సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో కొత్త చట్టాల విషయంలో మొదటి లో కేంద్రానికి సపోర్ట్ గా నిలిచిన వైసీపీ..ఇప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తుంది అన్నది సస్పెన్స్ గా మారింది.