Confidential Go’s: తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామా అన్నట్లు ఏపిలో టీడీపీ, వైసీపీ నేతల తీరు ఉంది. అందుకు ఇది ఒక ఉదాహరణ. ఏపిలో వైసీపీ సర్కార్ జారీ చేస్తున్న రహస్య జీవోలపై టీడీపీ రాద్ధాంతం చేస్తుంది. ఈ నెల 1వ తేదీ నుండి ప్రభుత్వం 78 జివోలను జారీ చేయగా అందులో 46 రహస్య జివోలుగా పేర్కొంది. పారదర్శక పాలన అందిస్తున్నామని చెప్పుకుంటున్న వైఎస్ జగన్మోహనరెడ్డి హయాంలో 12 రోజుల్లో 50 రహస్య జీవోలు ఇచ్చారనీ, పారదర్శక పాలన ఎందుకు చేయలేకపోతున్నారనీ టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ అంశంపై శుక్రవారం వర్ల రామయ్య నేతృత్వంలో టీడీపీ నేతలు పలువురు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు అందించారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రహస్య జీవోలను పాలకులు విడుదల చేయడం ఇప్పుడు గానీ అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గానీ కొత్త కాదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో, ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనూ జివోలను కాన్ఫిడెన్షియల్ పేరుతో రహస్య జివోలను విడుదల చేశారు.
Read More: YCP Vs BJP: ఇక్కడ కొట్లాట ..అక్కడ దోస్తాన్ ..! బీజేపీ, వైసీపీ తీరుకు సాక్షం ఇదిగో..!!
రాష్ట్ర విభజనకు ముందు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వ ఆన్ లైన్ పోర్టల్ ఏపి ఆన్ లైన్.కామ్ ను 2005లో ప్రారంభించారు. 2008 ఫిబ్రవరి 7న వైఎస్ ప్రభుత్వం తొలి రహస్య జివోను విడుదల చేసింది. నాటి నుండి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న విభజన సమయం వరకూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 4,363 జివోలు విడుదల అయ్యాయి. వీటిలో వైఎస్ ప్రభుత్వం 2009 సెప్టెంబర్ 2వ తేదీ వరకూ 1,062 జివోలు విడుదల చేసింది. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు హయాంలోనూ రహస్య జీవోలు విడుదల చేశారు. అయితే చంద్రబాబు హయాంలో రహస్య జీవోలు విడుదల చేయడాన్ని నాడు వైసీపీ తప్పుబట్టింది. ఈ అంశంపై చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించింది కూడా. అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా గత పాలకుల హయాంలో మాదిరిగానే రహస్య జీవోలను విడుదల చేస్తుంది.
అయితే ఇప్పుడు గతంలో ఏ ప్రభుత్వ హయాంలో జరగనట్లు, ఇప్పుడే జగన్ సర్కార్ ఈ విషయంలో తీవ్ర తప్పిదం చేసినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసి ఫిర్యాదు చేయడం హస్యాస్పదంగా, విడ్డూరంగా ఉందని వైసీపీ అంటున్నది. నీవు నేర్పిన విద్యే నీరజాక్షా అన్నట్లు గత ప్రభుత్వ హయాంలో చేసినట్లుగానే జగన్ సర్కార్ కూడా కొన్ని కాన్ఫడెన్షియల్ జీవోలను విడుదల చేసింది. అయితే ఇదేదో తీవ్రమైన నేరం, ఘోరం జరిగినట్లు టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రహస్య జీవోలపై విమర్శించిన వైసీపీ ఇప్పుడు అదే బాణీ అవలంబించడం పట్ల కూడా విమర్శలకు దారి తీస్తున్నది. పారదర్శకతకు పెద్ద పీట అంటున్న జగన్ సర్కార్ లోనూ జివోలను రహస్యంగా పెట్టడం ఏమిటంటూ విమర్శలు వస్తున్నాయి.