MLC Elections: గత నెల కోవిడ్ ఉధృతి వేళ ఎన్నికలను నిర్వహించిన నేపథ్యంలో ఎన్నికల సంఘానికి మద్రాస్ హైకోర్టు అక్షింతలు వేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలకు ఈసీ తీవ్రంగా నొచ్చుకుని సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే ఈసీ అభ్యంతరాలను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ఏపి, తెలంగాణలో త్వరలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను ఈసీ నిర్వహించాల్సిన ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితిలో ఎన్నికలను నిర్వహిస్తే మళ్లీ కోర్టుల నుండి చివాట్లు తప్పవని భావించిన ఈసీ ఇప్పుడు కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
కరోనా వైరస్ తీవ్రత దృష్యా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పట్లో ఎమ్మెల్సీలు ఎన్నికలు ఉండవని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. కోవిడ్ ఉధృతి తగ్గే వరకూ ఏపి, తెలంగాణలోని 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరపలేమని తెలిపింది. ఈ మేరకు ఈసీ ప్రకటన విడుదల చేసింది. పరిస్థితులు మెరుగు పడిన తర్వాతే నిర్వహిస్తామని తెలిపింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఖాళీలపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఈ లేఖపై చర్చించిన ఎన్నికల సంఘం..ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించరాదనే అభిప్రాయానికి వచ్చింది.
మే 31తో ఏపిలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు, జూన్ 3తో తెలంగాణలోని ఆరు స్థానాలు ఖాళీ కానున్నాయి. తెలంగాణలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, సభ్యులు కడియం శ్రీహరి, ఫరీరుద్దీన్, ఆకుల లలిత, బోడకుంటి వెంకటేశ్వర్లు పదవీ కాలం పూర్తి అవుతుంది. గవర్నర్ కోటాలో భర్తీ అయిన ఫ్రొఫెసర్ ఎం శ్రీనివాసరెడ్డి స్థానం జూన్ 16న ఖాళీ కానున్నది. గవర్నర్ కోటా కింద భర్తీ చేసే స్థానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన వ్యక్తి ఎమ్మెల్సీ అవుతారు. ఎమ్మెల్యే కోటా స్థానాలకు శాసనసభ్యులు ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు.
ఈ ఎన్నికలకు ప్రజానీకంతో సంబంధం లేకపోయినా ప్రజా ప్రతినిధులు ఓటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ షెడ్యుల్ విడుదల చేస్తే ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే స్టే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరో సారి మందలింపు పడాల్సి వస్తుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న ఈసీ ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని తేల్చి చెప్పేసింది.