ఒకవైపు కీలకమైన ఎన్నికలు. అంతేకాదు.. పోటీ కూడా తీవ్రంగా ఉంది. ఏ క్షణం వేస్ట్ చేసినా ఇబ్బందు లు తప్పవు. కాలికి బలపం కట్టుకుని ఇంటింటికీ ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఇక, ప్రజలను మచ్చిక చేసుకునేందుకు రోడ్ షోలు, సభలు సమావేశాలు పెట్టాల్సిన అవసరం ఉంది. వీటిని మరింత పెంచాల్సిన అగత్యం కూడా పార్టీలకు ఉంది. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు.. ఠారెత్తిస్తున్న ఎండలు నాయకులకు గుబులు రేపుతున్నాయి.
ప్రస్తుతం ఏప్రిల్ నెలే అయినా.. ఎండలు మాత్రం మండిపోతున్నారు. పలు జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత లు నమోదవుతున్నాయి. దీంతో జనాలు ఇంటి నుంచి బయటకు రాలేక పోతున్న పరిస్థితి ఉంది. ఇది నాయకులకు, పార్టీలకు ఇబ్బందిగా మారింది. వాతావరణం కూలెక్కేందుకు సాయంత్రం 5 గంటల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. పోనీ.. అప్పుడైనా సభలకు, సమావేశాలకు తరలిద్దామంటే.. కూడా ఇబ్బందు లు వస్తున్నాయి.
ఈ పరిస్థితి వైసీపీ నుంచి టీడీపీ వరకు అన్ని పార్టీలను వెంటాడుతోంది. దీంతో ఉదయం పూట చంద్ర బాబు వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక, జగన్ బస్సుకే పరిమి తం అయ్యారు. బీజేపీ, జనసేన వంటివి ఏదైనా హాల్ చూసుకుని.. అక్కడకు నాయకులను రప్పించి.. ప్రసంగాలు దంచి కొడుతున్నారు. కానీ, ఇవి క్షేత్రస్థాయిలోకి వెళ్లడం లేదు. పోనీ.. ఇలా చేసుకున్నా ఎన్నాళ్లు? అనేది కీలక ప్రశ్న. మరో 30 రోజుల్లోనే ఎన్నికలు ఉన్నాయి.
దీంతో అన్ని పార్టీల నాయకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎండల దెబ్బకు పొలిటికల్ స్ట్రాటజీ దెబ్బతింటోందని అన్ని పార్టీల్లోనూ చర్చ సాగుతోంది. దీనికి విరుగుడు కనిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నా.. ఇంటింటి ప్రచారంపై ఎన్నికల సంఘం సమయం నిర్దేశించింది. ఉదయం 8 తర్వాత కానీ.. ఇంటింటి ప్రచారానికి అనుమతి ఇవ్వలేమని.. అది కూడా 48 గంటల ముందు పర్మిషన్ తీసుకోవాలని చెబుతున్నారు. కానీ, ఉదయం 7గంటలకే పనులకు వెళ్లిపోయే కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో ఇంత పెద్ద ఇబ్బంది లేదు. ఏప్రిల్లోనే ఎన్నికలు ముగిసిపోయాయి. కాని..ఇప్పుడు షెడ్యూల్ మారడంతో ఇబ్బందులు మామూలుగా లేవనే చర్చ సాగుతోంది.