Breaking: ఏపీలో ఎండ తీవ్రతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదయం నుండే భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. మరో వైపు వడగాల్పులు కూడా ఎక్కువ అయ్యాయి. మధ్యాహ్నం అయ్యే సరికి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం పది గంటల తర్వాత రోడ్డు మీదకు ప్రజలు వెళ్లే పరిస్థితి కనబడటం లేదు. దీంతో ఏపి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలల్లో ఒంటి పూట తరగతులను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నది. ముందుగా ప్రభుత్వం ఈ నెల 17వ తేదీ వరకు ఒంటి పూట బడుల నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఎండ తీవ్రత దృష్ట్యా సోమవారం (19వ తేదీ) నుండి ఈ నెల 24వ తేదీ వరకూ కూడా ఒంటి పూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 7.30 గంటల నుండి 11.30 గంటల వరకూ భోదనా సమయం. ఉదయం 8.30 గంటల నుండి 9 గంటల వరకూ రాగిజావ పంపిణీ. ఉదయం 11.30 గంటల నుండి 12 గంటల వరకూ మధ్యాహ్న భోజనం ఉంటుందని స్పష్టం చేసింది. విద్యార్ధులు స్కూల్ నుండి వెళ్లిన తర్వాత బయట తిరగొద్దని విద్యార్ధులకు విద్యాశాఖ అధికారుల సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావొద్దని తెలిపారు. ఎక్కువగా నీళ్లు, ఫ్రూట్ జ్యూస్ వంటివి తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.