ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అటు వైసీపీ, ఇటు కూటమి అన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాయి. ప్రత్యర్థులెవరనే అంచనాలు వేసుకుని అందరు నాయకులు బరిలో దిగారు, ప్రచారం మొదలు పెట్టారు. వీటిలో సర్వేపల్లి నియోజకవర్గం ఒకటే కాస్త ప్రత్యేకత సంతరించుకుంది. 2019లో ఇక్కడ ముఖాముఖి తలపడిన కాకాణి గోవర్దన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. ఆ మాటకొస్తే 2014లో కూడా వారే ఆ నియోజకవర్గంలో ప్రత్యర్థులు. ఇలా పాతవారే మళ్లీ ప్రత్యర్థులు కావడం ఈ నియోజకవర్గంలో ఈసారైన మార్పు కనిపిస్తుందా? అనే చర్చసాగుతోంది.
2014లో వైసీపీ తరపున కాకాణి గోవర్దన్ రెడ్డి సర్వేపల్లి నుంచి గెలిచారు. టీడీపీ అభ్యర్థిగా ఆయన చేతిలో ఓడిపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అనూహ్యంగా ఎమ్మెల్సీ అవకాశం లభించింది. ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు. 2019లో మళ్లీ వారిద్దరే పోటీ పడ్డారు. ఈసారి కూడా ఇక్కడ సోమిరెడ్డిపై కాకాణి విజయం సాధించారు. జగన్ రెండో విడతలో కాకాణికి మంత్రి పదవి ఇచ్చారు. ఆయనకు కూడా వ్యవసాయ శాఖ దక్కడం మరో విశేషం. ఇక 2024లో ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఆసక్తిగా మారింది. 2019లో మంత్రి హోదాలో సోమిరెడ్డి పోటీ చేస్తే, 2024లో మంత్రి హోదాలో కాకాణి బరిలో దిగుతున్నారు. ఈసారి ఎవరు గెలిచినా .. అదే పార్టీ అధికారంలోకి వస్తే వారికి మళ్లీ మంత్రి పదవి గ్యారెంటీ అనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.
ఇక నెల్లూరు జిల్లాలోని మిగతా నియోజకవర్గాల విషయానికొస్తే.. నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి సిద్ధపడగా, సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ని కాదని సీఎం జగన్ నెల్లూరు డిప్యూటీ మేయర్ ఖలీల్ ని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీ వైపు వచ్చి అదే స్థానానికి పోటీ చేస్తున్నారు. ఇక వైసీపీ తరపున ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేయడం విశేషం. ఇలా ఇక్కడ కూడా ప్రత్యర్థులు కొత్తవారే.
కోవూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బరిలో దిగగా, టీడీపీ అభ్యర్థిని మార్చింది. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇక్కడ టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. కావలిలో కూడా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వగా, టీడీపీ మాత్రం అభ్యర్థిని మార్చింది. ఉదయగిరిలో ఇరు పార్టీలు అభ్యర్థుల్ని మార్చేశాయి. ఆత్మకూరులో 2019లో వైసీపీ తరపున మేకపాటి గౌతమ్ రెడ్డి గెలిచి మంత్రి పదవి సాధించారు. ఆయన అకాల మరణంతో ఉప ఎన్నికల్లో ఆయన తమ్ముడు విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ ఇక్కడ ఆనం రామనారాయణ రెడ్డిని బరిలో దింపింది. వీరిలో ఆనం వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.