KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా టైంలో హైకోర్టు కేంద్రంగా వస్తున్న ప్రశ్నల వర్షం మళ్లీ ఎదురైంది. కరోనా థర్డ్ వేవ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చర్యలు సరిగ్గా లేకపోవడంతో కోర్టు జోక్యం చేసుకుని కొన్ని సూచనలు చేసిందని, వాటిని కూడా అమలు చేయడంలేదని, ఇక థర్డ్ వేవ్ వస్తే ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించింది. అయితే, ప్రభుత్వం మాత్రం తగు చర్యలు తీసుకుంటామని తెలిపింది.
Read More : Corona: షాక్ఃకరోనా టీకా పనిచేయడం లేదని కేసు పెట్టాడు
హైకోర్టు ప్రశ్నల వర్షం…
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డిలతో కూడిన బెంచ్ రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజారోగ్య డైరెక్టర్, డీజీపీ, కార్మిక, జైళ్ల శాఖలు, జీహెచ్ఎంసీ వేర్వేరుగా అందించిన నివేదికలను హైకోర్టు పరిశీలించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయడంలేదని నిలదీసింది. ఇప్పటివరకూ తీసుకున్న చర్యలు, ఇకపైన తీసుకోవాల్సిన అంశాలపై ప్రభుత్వం సమర్పించిన నివేదికలో పూర్తి వివరాలు లేవని పేర్కొంది. కరోనా కట్టడి కోసం, ప్రజలకు ఎదురయ్యే కష్టాల పరిష్కారం కోసం, ఇబ్బందులను తొలగించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సలహా కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పినా ఇంకా ఆ దిశగా ఏర్పాట్లు కూడా లేవని గుర్తుచేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో టెస్టుల సంఖ్యను పెంచడం కీలకమని, కొత్తగా ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చేసే లాబ్లను నెలకొల్పాలని సూచించినా ఇంకా అందుబాటులోకి ఎందుకు రాలేదని ప్రశ్నించింది.
Read More : Corona: కరోనా విషయంలో కేంద్రం ముచ్చట నమ్మేలా లేదు… ఓవైసీ సంచలనం…
ప్రైవేట్ ఆస్పత్రుల విషయంలో కన్నెర్ర….
ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సల కోసం గరిష్టంగా ఎంత ఛార్జి చేయవచ్చునో ప్రభుత్వం కొత్తగా జీవోను జారీ చేయాలని హైకోర్టు గత విచారణ సందర్భంగా సూచించినా ఇప్పటికీ అలాంటి ఉత్తర్వులు ఎందుకు వెలువరించలేదని ప్రశ్నించింది. అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒకే తరహా చికిత్స ఛార్జీలు ఉండాలని చెప్పినా అమలు కావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్మెంట్ కోసం బంగారాన్ని తాకట్టు పెడుతున్నారని, ఆస్తులు అమ్ముకుంటున్నారని, ఇంత ఎక్కువ ఫీజులు వసూలు చేస్తూ ఉంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ స్పందిస్తూ, ఇప్పటికే 79 ఆస్పత్రులకు 115 షోకాజ్ నోటీసులను జారీ చేశామని అందులో పది ఆసుపత్రులకు కరోనా చికిత్స కోసం ఇచ్చిన అనుమతులను రద్దుచేసినట్లు తెలిపారు. మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పడకలను పెంచుతున్నట్లు తెలిపారు.