కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి కి సికింద్రాబాద్ లో ఎదురు లేనట్టేనా.. ఆయనకు లైన్ క్లియర్ అయినట్లేనా.. ఇద్దరు బీసీ నేతల మధ్య రెడ్డి గారు బీజేపీ జెండాను రెపరెపలాడించేలా కనిపిస్తున్నారు. బీజేపీ రెడ్డికి కాంగ్రెస్ రెడ్డి స్నేహహస్తం అందిస్తున్నారా.. అందుకే ఈ నియోజకవర్గంలో ఉలుకు పలుకు లేకుండా ఇతర పార్టీలు ఉన్నాయి.. తెలంగాణ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న సికింద్రాబాద్ పార్లమెంటు ఎన్నికపై అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రతిపక్ష బీ ఆర్ ఎస్ గాని పెద్దగా దృష్టి పెట్టినట్లు కనిపించలేదు. కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి మేలు చేసేందుకే రెండు పార్టీల పెద్దలు గమ్మున ఉన్నారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో కిషన్రెడ్డి సిట్టింగ్ ఎంపీ. ఈ స్థానం నుంచి గెలిచి కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. కేంద్ర మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రి కిషన్రెడ్డి. బీజేపీ నుంచి మరోసారి గెలిచి కేంద్రంలో చక్రం తిప్పాలని చూస్తున్న కిషన్రెడ్డికి అది సులువుగానే అందేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నకాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్, బీ ఆర్ ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ ప్రచారం సప్పగా సాగుతుందనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కిషన్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారని, దానం నాగేందర్, పద్మారావు గౌడ్ మాత్రం నత్తనడకన సాగుతుందట. దానం నాగేందర్ పరిస్థితి చూస్తే ఇంకా ఆధ్వాన్నంగా ఉందని అంటున్నారు.
బీ ఆర్ ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ కు ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో అందరు బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక దానం నాగేందర్ చేరికను సీనియర్లు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్పుడు దానం నాగేందర్ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిగా మారింది. అటు సీనియర్లు సహాకరించరు.. ఇటు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్రెడ్డి కేవలం సన్నహాక సమావేశం పెట్టి మమ అనిపించారు. ఇప్పుడు దానం ఓంటరిగానే ప్రచారం చేసుకుంటున్నారు.
ఇక బీ ఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పద్మారావు గౌడ్ పరిస్థితి కొంత మెరుగుగానే ఉన్నప్పటికి పార్టీ నాయకత్వం పూర్తి స్థాయిలో పనిచేయడం లేదనే విమర్శలు లేకపోలేదు. ఏడు నియోజకవర్గాల్లో ఒక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని బీ ఆర్ ఎస్ కు ప్రత్యర్థిగా మారాడు. ఇక కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఇప్పుడు ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే పద్మారావు గౌడ్కు సహాకారం అందిచనున్నారు.
అయితే ఇప్పుడు పద్మారావు పరిస్థితి తీసికట్టు నామంబొట్టు అనే చందంగా ఉందని చెప్పవచ్చు. అభ్యర్థిగా ఎక్కువగా ఒంటరిగానే ప్రచారం చేస్తున్నారు. దీంతో ఇద్దరు బీసీ నేతల మధ్య కిషన్రెడ్డన్నకు సరైన పోటీ ఇవ్వలేక పోతున్నారనే ప్రచారం ఉంది. ఏదేమైనా ఈ స్థానం కిషన్రెడ్డికి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టే సూచనలే కనిపిస్తున్నాయని సర్వే సంస్థలు చెపుతున్నాయి.