KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య మరోమారు నీటి యుద్ధం తారాస్థాయికి చేరిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. `ఆర్డీఎస్ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిలిపి పనులు చేస్తోంది. కృష్ణాలో తక్కువ, గోదావరిలో ఎక్కువ నీరు ఉన్నందున…గోదావరి నీళ్లను వాడుకుందామంటే వాళ్లు మొండిగా పోతున్నారు. ఒక్క నీటి బొట్టును కూడా వదులుకునేది లేదు అవసరమైతే శాసనసభ మొత్తాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో కూర్చుంటాం.“ అని కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆర్డీఎస్ వద్ద ఏం జరుగుతోందనే చర్చ తెరమీదకు వస్తోంది.
KCR ప్రాణం పోయినా…
ప్రాణం పోయినా సరే నీటి వాటా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అనడం వెనుక క్షేత్రస్థాయిలోని పరిస్థితులు కారణమని పలువురు అంటున్నారు. ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్కు ఎగువన కొత్త కాల్వను నిర్మిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దిగువన రూ.799 కోట్లతో చేపట్టిన తుమ్మిళ్లకు వరద నీరు రాకుండా పోయే పరిస్థితి కొత్త కాలువ ద్వారా తలెత్తుతుందని భయపడుతున్నారు. కొత్త కాలువ నిర్మాణంపై కేంద్రానికి పిర్యాదు చేసినా ఫలితం లేదని తెలంగాణ పాలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇరు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు ఆర్డీఎస్ ఆధారంగా ఇరు ప్రభుత్వాలపై విమర్శలకు దిగుతున్నారు.
కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్న విపక్షాలు…
ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త కాల్వ నిర్మాణాన్ని అడ్డుకుంటామన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీకి లేఖ రాయాలని, అవసరమైన వేదికలపై ఏపీ ప్రభుత్వ తీరును ఎండగట్టాలని టీ.కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొత్త కాలువ నిర్మాణాన్ని ఆపేసేందుకు ఐక్యంగా ఉద్యమించాలని తెలంగాణ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఏపీ సర్కార్ చర్యలను కేసీఆర్ ప్రభుత్వం మొక్కుబడిగా వ్యతిరేకిస్తుందని, నిజానికి కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి జగన్తో కుమ్మక్కయ్యారని తెలంగాణ బీజేపీ నేత, ఆర్డీఎస్ పరీవాహక ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి డీ.కే. అరుణ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ విషయంలో దూకుడుగా ముందుకు సాగాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.