YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు గన్నవరం విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. షర్మిల రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే. సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తన కుమారుడు వివాహ మహోత్సవ ఆహ్వానం ఇచ్చేందుకు వైఎస్ షర్మిల కడప నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం కు చేరుకున్నారు.
గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ అభిమానులతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు షర్మిలకు స్వాగతం పలికారు. షర్మిల కంటే ముందుగా గన్నవరం ఎయిర్ పోర్టుకు ఆమె భర్త బ్రదర్ అనిల్ చేరుకున్నారు. విజయవాడ చేరుకున్న వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, కాబపోయే కోడలు, భర్త బ్రదర్ అనిల్ కలిసి తాడేపల్లికి చేరుకుని జగన్ తో భేటీ కానున్నారు. ఇవేళ రాత్రికి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు.
కాగా విమానాశ్రయం వద్ద ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ .. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తాను పార్టీలో చేరతానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. నాడు వైఎస్ జగన్మోహనరెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీని వీడి వచ్చానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా బలంగా ఉన్నటువంటి పార్టీ అని అన్నారు. బలమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వ్యక్తుల గురించి పార్టీ అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. వారితో చర్చలన్నీ పార్టీనే జరుపుతోందని ఆర్కే అన్నారు.
IAS Transfer: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ