Lockdown: తెలంగాణలో మళ్లీ కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. అత్యంత షాక్ కు గురయ్యేలా గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లాలోని రెండు గ్రామాల్లో అనుమానం వచ్చి చెక్ చేయడంతో భారీగా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు జగిత్యాల జిల్లా మెట్పల్లి టౌన్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఏడీబీ) స్టాఫ్కు కరోనా సోకింది. మేనేజర్, అకౌంటెంట్, ఫీల్డ్ ఆఫీసర్ తో పాటు మరొకరికి పాజిటివ్ అని తేలడంతో సోమవారం బ్రాంచ్ను క్లోజ్ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ విధించనున్నారా? అనే ప్రచారం జరుగుతోంది.
Lockdown కరీంనగర్ లో ఏం జరిగింది ?
కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి గ్రామంలో ఇటీవల ఓ వ్యక్తి మృతి చెందారు. అతని అంత్యక్రియల్లో చాలామంది పాల్గొన్నారు. రెండు రోజుల తరవాత అంత్యక్రియల్లో పాల్గొన్న వ్యక్తి ఒకరికి కరోనా లక్షణాలు రావడంతో అనుమానంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఆరోగ్య శాఖ గ్రామంలో క్యాంపు ఏర్పాటు చేసింది. అంత్యక్రియల్లో పాల్గొన్న అందరికీ పరీక్షలు చేశారు. మొత్తం 33 మందికి పాజిటివ్ అని తేలింది. ఇప్పటికే జిల్లాలో మొత్తం 281 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
ఎందుకు ఈ సమస్య?
కరోనాకు వ్యాక్సిన్ రావడం… ప్రభుత్వం సైతం లాక్ డౌన్ రూల్స్ పూర్తిగా సడలించడంతో ప్రజలు కూడా కరోనా వైరస్ ఉందనే విషయాన్ని మరిచిపోయి తిరుగుతున్నారు. చాలామంది ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం లేదు. శానిటైజర్, మాస్క్ వంటివి వినియోగించడం లేదు. ఇష్టారీతిగా వ్యవహరిస్తుండడంతో వైరస్ మరింతగా వ్యాప్తించే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
లాక్ డౌన్ పెడతారా?
కరోనా కేసులు పెరగకుండా ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. సరిహద్దు రాష్ట్రాలయిన మహారాష్ట్ర , కర్ణాటక, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో కేసులు అత్యధికంగా ఉన్నాయన్నారు. సరిహద్దు దగ్గర కూడా ఎలాంటి ఆంక్షలు పెట్టబోమన్నారు. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల దగ్గర జనం జాగ్రత్తగా ఉండాలన్నారు. కరోనా విషయంలో అలసత్వం వద్దన్నారు. ప్రస్తుతానికి లాక్ డౌన్ ఆలోచనలు లేవని..రాష్ట్రం సేఫ్ గా ఉందన్నారు.