YSRCP: లోక్ సభలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, వైసీపీ ఎంపి మిథున్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగింది. లోక్ సభ జీరో అవర్ లో అమరావతి రైతుల మహా పాదయాత్ర గురించి రెబల్ ఎంపి రఘురామ ప్రస్తావించారు. రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని రఘురామ సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై రఘురామ మాట్లాడుతున్న సమయంలో వైసీపీ ఎంపీలు ఆయన వ్యాఖ్యలకు అడ్డు చెప్పారు. హైకోర్టు అనుమతితో రైతులు పాదయాత్ర చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరమని రఘురామ అన్నారు. శాంతి భద్రతల అంశం రాష్ట్ర పరిధిలోనిది అయినా అక్కడ క్షీణించాయని అన్నారు. ప్రజల ప్రాధమిక హక్కులను కూడా పోలీసులు హరిస్తున్నారని రఘురామ ఆరోపించారు. రఘురామ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైసీపీ ఎంపి మిథున్ రెడ్డి రఘురామ వ్యాఖ్యలను ఖండించారు. సీబీఐ కేసుల నుండి బయటపడేందుకు ఎంపి రఘురామ అధికార బీజేపీలో చేరేందుకు తహతహలాడుతున్నారని మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. రఘురామపై ఉన్న సీబీఐ కేసులను వేగంగా దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీనిపై రఘురామ మాట్లాడుతూ తన పైన రెండు సీబీఐ కేసులే ఉన్నాయనీ, సీఎం జగన్ పై వంద సీబీఐ కేసులు ఉన్నాయనీ, ముందు వాటి సంగతి తేల్చాలని అన్నారు.
YSRCP: అమరావతి రైతుల మహా పాదయాత్ర
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతాంగం న్యాయస్థానం నుండి దేవస్థానం (అమరావతి నుండి తిరుమల) పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత వీరి పాదయాత్రకు డీజీపీ అనుమతి నిరాకరించిన నేపథ్యంలో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అటు పోలీసులు, ఇటు పిటిషన్ల తరపున వాదనలు విన్న హైకోర్టు.. అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి ఇస్తూ బందోబస్తు కల్పించాలని ఆదేశించింది. పోలీసు బందోబస్తు నడుమ అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. గుంటూరు జిల్లా అమరావతిలో ప్రారంభమైన ఈ పాదయాత్ర ప్రకాశం, నెల్లూరు జిల్లా మీదుగా చిత్తూరు జిల్లాకు ప్రవేశించనున్నది. ప్రకాశం జిల్లాలో పాదయాత్ర పూర్తి అవ్వగా నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. అయితే నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రకాశం, నెల్లూరు జిల్లాలో పోలీసులు కేసులు నమోదు చేశారు. పలు ప్రాంతాల్లో రైతులకు సంఘీభావం తెలియజేసేందుకు వచ్చిన రైతులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.