Mudragada Padmanabham: కాపు ఉద్యమానికి, క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లు ప్రకటించిన ముద్రగడ పద్మనాభం కొద్ది రోజులుగా లేఖాస్త్రాలు సంధిస్తూ యాక్టివ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల దళిత, బీసీ, కాపు నేతలతో ముద్రగడ సమావేశం ఏర్పాటు చేయడంతో ఉమ్మడి కార్యాచరణలో రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలకు బలం చేకూరేలా రాజ్యాధికారం కోసం రాష్ట్రంలోని దళిత, బీసీ, కాపులు ఐక్యం కావాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు ముద్రగడ. దళిత, బీసీ, కాపు సోదరులను చైతన్యపర్చడానికి ఈ లేఖ రాస్తున్నట్లు ముద్రగడ పేర్కొన్నారు.
Mudragada Padmanabham: అధికారాన్ని గుంజుకోవాలి
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందే కానీ మన జాతులకు మాత్రం రాలేదని ముద్రగడ అన్నారు. ఇంత కాలంగా రాజ్యాధికారాన్ని వారు వారే అనుభవించారు. అనుభవిస్తున్నారనీ, అధికారాన్ని గుంజుకోవాలే తప్ప బిక్షం వేయమని అడిగినా వేయరని అన్నారు. తక్కువ జనాభా కల్గిన వారు అధికారం ఎందుకు అనుభవించాలి, ఎక్కువ జనాభా కల్గిన మన జాతులు ఎందుకు అనుభవించకూడదో ఆలోచన చేయాలన్నారు. ఎంత కాలం ఇలా పల్లకీలు మోయాలో తీవ్రంగా ఆలోచన చేయవలసిన అవసర వచ్చిందన్నారు. ఇతర గౌరవ బీసీ మరియు దళిత నాయకులు సహకారం తీసుకుని బ్లూ ప్రింట్ తయారు చేద్దామని ముద్రగడ పేర్కొన్నారు.
ఇదీ ముద్రగడ రాజకీయ వ్యూహం
అయితే ముద్రగడ రాజకీయ వ్యూహంపై పలు రకాల వాదనలు వినబడుతున్నాయి. రాష్ట్రంలో జనసేన – టీడీపీ రాబోయే ఎన్నికల నాటికి పొత్తు పెట్టుకుంటాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కాపు సామాజికవర్గం ఆ కూటమికి దగ్గర కాకుండా ఉండేందుకే కొత్త రాజకీయ పార్టీని తెరపైకి తీసుకువస్తున్నారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు కాపు రిజర్వేషన్ అంటూ పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన ముద్రగడ.. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కాపులకు రిజర్వేషన్ పై ఊసే ఎత్తలేదు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చే అవకాశమే లేదని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేసినా నోరు మెదపలేదు..ప్రభుత్వంపై ఉద్యమాన్ని ప్రకటించలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో మెజార్టీ కాపు సామాజికవర్గం వైసీపీకి కాపుకాసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఆ సామాజికవర్గాన్ని దగ్గర చేసుకునే పనిలో జనసేన నిమగ్నమై ఉండగా, ముద్రగడ..దళిత, బీసీ, కాపు సోదరులు అంటూ ఎంట్రీ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ముద్రగడ రాజకీయ వ్యూహం వైసీపీకి వ్యతిరేకంగానా..? లేక టీడీపీ – జనసేనను దెబ్బతీయడానికా..? లేక నిజంగానే రాజ్యాధికారం కోసమా అనేది మీరు గెస్ చేయండి.