YSRCP: తెలంగాణకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త జూపల్లి రామేశ్వరరావు వైసీపీ సభ్యత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపి నుండి త్వరలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలు అధికార వైసీపీకే దక్కనున్న సంగతి తెలిసిందే. రాజ్యసభ స్థానాలను వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పలువురి నేతలకు గతంలో హామీలు ఇచ్చినప్పటికీ వీటికి తీవ్రమైన పోటీ నెలకొనడంతో సీఎం జగన్ ఎవరికి అవకాశం కల్పిస్తారు అనేది ఉత్కంఠగా మారింది. పార్టీ నేతలు పలువురు ఈ పదవులపై ఆశ పెట్టుకోగా పలువురు పారిశ్రామిక వేత్తలు జగన్ తో ఉన్న పరిచయాలతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇంతకు ముందు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సిఫార్సు మేరకు పరిమళ్ నత్వానికి జగన్ అవకాశం కల్పించారు. ఈ సారి అదే విధంగా మరో పారిశ్రామిక దిగ్గజం ఆదానీ గ్రూపు అధినేత గౌతమ్ ఆదానీ సతీమణి ఛాన్స్ ఇవ్వనున్నారని వార్తలు వినబడుతున్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
YSRCP: తాజాగా జూపల్లి రామేశ్వరరావు పేరు
మిగిలిన మూడు స్థానాల్లో విజయసాయిరెడ్డికి మరో సారి అవకాశం కల్పిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆయనకు పార్టీ అనుబంధ విభాగాల ఇన్ చార్జి బాధ్యతలతో పాటు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్స్, జిల్లా అధ్యక్షుల కోఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో మరో సారి రాజ్యసభకు పంపుతారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. మిగిలిన రెండు స్థానాలకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బీసీ వర్గానికి చెందిన పారిశ్రామిక వేత్త బీదా మస్తాన్ రావు పేర్లు వినబడుతుండగా తాజాగా తెలంగాణకు చెందిన పారిశ్రామిక వేత్త, మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావు పేరు వినబడుతోంది. టీఆర్ఎస్ అధినేత, సిీఎం కేసిఆర్ కు అత్యంత సన్నిహితుడుగా ఇప్పటి వరకూ ఆయన ఉన్నారు. అయితే చిన జియ్యర్ స్వామీజీ ఆధ్వర్యంలో సమతామూర్తి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాల అనంతరం చిన జియ్యర్ తో పాటు మైహోం రామేశ్వరరావుతో కేసిఆర్ కు గ్యాప్ ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి.
హైదరాబాద్ ఫార్మా రంగం దిగ్గజాలు కూడా..
ఈ నేపథ్యంలో ఏపి నుండి రాజ్యసభ కు ఎన్నిక అయ్యేందుకు మైహోం రామేశ్వరరావు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. సమతామూర్తి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాల్లో పాల్గొన్న ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని చిన జియ్యర్ స్వామిజీ పొగడ్తలతో ముంచెత్తారు. చిన జియ్యర్ ఆశీస్సులకు తోడు వైఎస్ జగన్ తో ఉన్న పరిచయాలతో రాజ్యసభ సీటును రామేశ్వరరావు ఆశిస్తున్నారుట. మరో పక్క హైదరాబాద్ ఫార్మా రంగంలోని పలువురు పారిశ్రామిక వేత్తలు కూడా వైసీపీ కోటాలో రాజ్యసభ సీటును ఆశిస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో మొదటి నుండి పని చేసి తను హామీ ఇచ్చిన నేతలను జగన్ రాజ్యసభకు పంపుతారా లేక పారిశ్రామిక వేత్తలకు అవకాశం కల్పిస్తారా అనేది తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.