Nandamuri Balakrishna : రాజకీయ నేతలు ఎన్నికల సమయంలో ప్రత్యర్ధులపై వ్యక్తిగత విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. హుందా రాజకీయాలకు కాలం చెల్లింది. గతంలో రాజకీయ నేతలు ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేయడం చాలా తక్కువగా ఉండేది. ప్రత్యర్థులు చేసిన తప్పుడు విధానాలపైనే మాట్లాడటం, విమర్శలు చేయడం చేసే వారు. కానీ ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు, తిట్లు, బూతులు, ఘాటు వ్యాఖ్యలు పరిపాటిగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో పురపాలక సంఘ ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రచార పర్వంలో వైసీపీ, టీడీపీ మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పై సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రెండు రోజులుగా హిందూపూర్ మున్సిపాలిటీలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న మున్నటి వరకూ మంత్రులపై తీవ్ర విమర్శలు చేసిన బాలకృష్ణ నేడు వైఎస్ జగన్ పైనే తీవ్ర విమర్శలు చేశారు. జగన్ వీడియో గేమ్ లు ఆడుకుంటూ కాలయాపన చేస్తున్నారనీ, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. జగన్ వీడీయో గేమ్ లు ఆడుతుంటారనీ, పబ్జీ గేమ్ ఆడుతూ ఆ పార్టీ ఎమ్మెల్యేలనే పట్టించుకోవడం లేదని గతంలో పలువురు టీడీపీ నేతలు విమర్శించారు. ఇప్పుడు తాజాగా బాలకృష్ణ కూడా జగన్ పై ఇదే తరహా విమర్శలు చేయడం గమనార్హం.
టీడీపీ హయాంలో పట్టణ ప్రాంత పేద వర్గాల కోసం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటిన్ లను మూసి వేసి వాళ్ల నోట్లో మట్టికొట్టారని బాలకృష్ణ మండిపడ్డారు. హిందూపూర్ లో ప్రజల దాహార్తి తీర్చిన ఘనత టీడీపిదేనని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసింది తెలుగుదేశం పార్టీయేనని బాలకృష్ణ అన్నారు. రెండేళ్లలో ప్రజలకు ఏమి చేశారో చెప్పే ధైర్యం మంత్రులకు లేదనీ, కేవలం చంద్రబాబును విమర్శించడమే పని గా పెట్టుకున్నారని అన్నారు. ఒక్కో మాఫియాకు ఒక్కో మంత్రిని ఏర్పాటు చేశారని విమర్శించారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండటం వల్లనే పోలీసులు, వాలంటీర్ల ద్వారా బెదిరింపులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారనీ, అధికార పార్టీ ఆటలు సాగవని బాలకృష్ణ అన్నారు.