Panchayat polls : రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం 6.30గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటల వరకూ జరుగనున్నది. విజయనగరం జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2,723 గ్రామ పంచాయతీల్లో నేడు తొలి దశ పోలింగ్ జరుగుతుండగా 7,506 మంది సర్పంచ్ స్థానాలకు పోటీలో ఉన్నారు. 20,157 వార్డు సభ్యుల స్థానాలకు 43,601 మంది బరిలో ఉన్నారు.
మొత్తం నేడు జరగాల్సిన 3,249 గ్రామ పంచాయతీల్లో 525 చోట్ల ఏకగ్రీవాలు అయ్యాయి. గుంటూరు, చిత్తూరు జిల్లాలో నిలిపివేసిన ఎకగ్రీవాలను ఎస్ఈసీ సోమవారం సాయంత్రం తిరిగి అనుమతించింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలి సారిగా నోటాను అందుబాటులోకి తెచ్చారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరగనుంది. కోవిడ్ పేషంట్ లకు పిపిఈ కిట్లతో చివరి గంట సేపు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. ఎన్నికలను పురస్కరించుకుని పలు గ్రామాల్లో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణలు, ఉద్రిక్తతలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. ఘర్షణలు తలెత్తిన ప్రాంతాలకు వెంటనే పోలీసులు చేరుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకువస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.