Rayalaseema Politics: అనంతపురం రాజకీయాలు హీటెక్కుతున్నాయి. పరిటాల, తోపుదుర్తి కుటుంబాల మధ్య మాటల యుద్ధం ఎన్నికల రణరంగాన్ని తలపిస్తోంది. సహజంగా ఎన్నికల సమయంలో ఉండే మాటల తూటాలు.. ఇప్పుడు నడుస్తున్నాయి. దీంతో ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజకీయ వైరం నుంచి వీరిద్దరి మధ్య ఆస్తుల విషయంలో రగడ జరుగుతోంది. ఎమ్మెల్యేగా ఇన్ని ఆస్తులెలా.. అని మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపిస్తే.. విప్లవం పేరుతో కొండల్లో ఉన్నవారికి ఈరోజు వేల కోట్ల ఆస్తి ఎక్కడిది అని తోపుదుర్తి బ్రదర్స్ ప్రత్యారోపణలతో రాజకీయ రగడ నడుస్తోంది. అధికారం ఉందిగా.. నిరూపించండి అని పరిటాల శ్రీరామ్ సవాల్ చేస్తే.. గతంలో అధికారం అండతో మీరెలా భూకబ్జాలు చేశారో నిరూపిస్తాం.. అని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అంటున్నారు.
మాటల యుద్ధం..
మాజీ మంత్రి పరిటాల సునీతకు ప్రస్తుత (Rayalaseema Politics) రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి వ్యాపారాలు ఉన్నాయి. ఆస్తులు కూడా ఎక్కువే ఉన్నాయి. ఇన్నాళ్లూ ప్రశాంతంగానే ఉన్న అక్కడి వాతావరణం తోపుదుర్తి బ్రదర్స్ పై పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలు ఈ మాటల యుద్ధానికి ఆజ్యం పోశాయి. ఒకప్పుడు అద్దె ఇంట్లో ఉండేవారికి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి.. డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా డైరీ ఏర్పాటు చేస్తామని డబ్బులు వసూలు చేసి రియల్ ఎస్టేట్ కు మళ్లిస్తున్నారని ఆరోపించారు. దీంతో తోపుదుర్తి బ్రదర్స్ రియాక్టయ్యారు. కమ్యూనిస్టు ఉద్యమాల పేరుతో కొండల్లో ఉండేవారికి ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, అనంతపురంలో వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
ఆరోపణలు, ప్రత్యారోపణలు..
దీంతో రంగంలోకి దిగిన పరిటాల శ్రీరామ్.. తమ వ్యాపారాలు పక్కగా ఉన్నాయని, ట్యాక్సులు కడుతున్నామని.. ఎంక్వైరీ చేసుకోండని సవాల్ విసిరారు. మా ఆస్తులు చట్టబద్దం కాకపోతే పేదలకు పంచేస్తా. మేము మీ ఆస్తులు చూపిస్తే అవి పంచే దమ్ముందా..? డ్రాక్రా మహిళల డబ్బు పక్కదారి పట్టిందని నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. ‘రాజకీయాల్లో శ్రీరామ్ ఓ జూనియర్’ అని ప్రకాశ్ రెడ్డి అన్నారు. పరిటాల సునీత మంత్రిగా ఉన్నప్పుడు (Rayalaseema Politics) రాప్తాడు పరిధిలో భూములు కాజేశారంటూ సర్వే నెంబర్లతో సహా చూపించారు ప్రకాశ్ రెడ్డి. వీటన్నింటి వెనుక ఎవరున్నారో.. సహకరించారో బయటపెడతానని అన్నారు. మొత్తంగా ఆరోపణలు, సవాళ్లతో రాప్తాడు రాజకీయం సంచలనంగా మారుతోంది.