Vangaveeti Radha: దివంగత నేత వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వివాహం ఘనంగా జరిగింది. నరసాపురంకు చెందిన జక్కం బాబ్జీ, అమ్మాణిల కుమార్తె పుష్పవల్లి తో రాధా వివాహం విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్ నందు అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ వివాహానికి అనేక మంది ప్రముఖులు, రాజకీయాలకు అతీతంగా నేతలు, ప్రజాప్రతినిధులు హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం రాధ వివాహ వేడుకకు హజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వంగవీటి రాధాతో పవన్ కళ్యాణ్ ముచ్చటిస్తున్న ఫోటోలను జనసేన తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసి .. రాధాకు శుభాకాంక్షలు తెలిపింది. “విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ వంగవీటి రాధాకృష్ణ వివాహ వేడుకకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. ఆదివారం రాత్రి విజయవాడ, పోరంకిలోని మురళీ రిసార్ట్స్ లో జరిగిన ఈ వేడుకకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు హాజరయ్యారు. నూతన వధూవరులు వంగవీటి రాధాకృష్ణ, పుష్పవల్లిలకు శుభాకాంక్షలు తెలిపారు”
రాధా పుష్పవల్లి వివాహ నిశ్చితార్ధం ఆగస్టు నెలలో జరిగిన సంగతి తెలిసిందే. పుష్పవల్లి తల్లిదండ్రులు రాజకీయ నేతలు కావడం గమనార్హం. ఏలూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ జక్కం అమ్మాణి, బాబ్జీ దంపతుల కుమార్తె పుష్పవల్లి. వీరు ప్రస్తుతం జనసేనలో యాక్టివ్ గా పని చేస్తున్నారు. గోదావరి జిల్లాలో జరిగిన వారాహి యాత్ర సందర్భంగా నరసాపురంలోని జక్కం బాబ్జీ ఇంట్లో పవన్ కళ్యాణ్ బస చేశారు. ఆ సమయంలోనే రాధా పెళ్లి విషయంపై పెద్దలతో మాట్లాడినట్లుగా ప్రచారం జరిగింది. వంగవీటి రాధాకృష్ణ ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నా రాజకీయాలకు అతీతంగా స్నేహితులు ఉన్నారు. అయితే రాధా జనసేనలోకి వెళ్తారనే ప్రచారం కొద్ది నెలల క్రితం జరిగింది.
కానీ నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగిన సమయంలో రాధ పాల్గొని లోకేష్ కు స్వాగతం పలికారు. కొద్ది దూరం లోకేష్ తో పాటు నడిచారు. దీంతో ఆ వార్తలకు తెరపడినట్లు అయ్యింది. గత ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీమానా చేసి టీడీపీలో చేరిన రాధా .. 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున తొలిసారిగా 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన రాధా.. ఆ తర్వాత రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నప్పటికీ మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోయారు. ఇప్పటికే టీడీపీ – జనసేన పొత్తు ఖరారు అయిన నేపథ్యంలో రాధా పార్టీ మారాల్సిన పని లేకుండానే ఉమ్మడి అభ్యర్ధిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయన్నారని అంటున్నారు. ఆయితే ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు అనే దానిపై క్లారిటీ లేదు.