Pawan Kalyan : రాష్ట్రంలో రాజకీయాలు రోజుకు ఒక టాపిక్ తో హీట్ పుట్టిస్తున్నాయి. ఓ పక్క రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ బలంగా ఉన్నప్పటికీ మెజార్టీ నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణితో ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీల మధ్య అంతర్గత వైరుధ్యాలు కొనసాగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో టీడీపీ మద్దతుదారులు పోటీకి దూరంగా ఉన్న గ్రామాల్లో వైసీపీ లోని రెండు వర్గాలు పోటీకి దిగుతున్నాయి. ఆ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు ఒకరికి మద్దతు తెలిపితే మరొకరు దూరం అవుతున్నారని భావించి గ్రామస్థాయిలో తేల్చుకుని రండి చెప్పి పంపుతున్నారు. ఎవరు గెలిచినా ఓడినా ఇద్దరు పార్టీ నుండి బయటకు వెళ్లకుండా చూసుకుంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే గడచిన అసెంబ్లీ ఎన్నికల తరువాత అధికారంలో ఉన్నన్నాళ్లు పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వారు పార్టీని వీడి బీజెపీలో చేరడంతో కొంత డీలాపడ్డారు. ఆ తరువాత టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తుండటంతో క్యాడర్ మరింత కుంగిపోయింది. ఇప్పటి నుండి పార్టీలో యాక్టివ్ తిరిగి కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులు పడటం దేనికని చాలా మంది వారి వారి పనుల్లో నిమగ్నమైపోయారు.
BJP : తెలంగాణ ఎన్నికల స్పూర్తితో ఆంధ్రలో అడుగులు
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం ప్లేస్ ను ఆక్రమించి అధికార వైసీపీికి ప్రత్యామ్నాయం అవ్వాలని బీజెపీ – జనసేన కూటమి భావిస్తున్నది. వీరి ప్రధాన లక్ష్యం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కైవశం చేసుకోవడమే. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో ఘన విజయం సాధించడం, గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో పదింతలు బలం పెంచుకోవడంతో బీజెపీకి అడ్వాంటేజ్ గా మారింది. అదే ఊపు, దూకుడు ఏపిలోనూ బీజేపీ పుంజుకోవడానికి పావులు కదుపుతోంది. బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవలే కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో భేటీ అయి ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. బీజెపీ – జనసేన కూటమిలోకి రావాలంటూ ఆహ్వానించారు. ఆ తరువాత హైదరాబాదులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో తిరుపతి ఉప ఎన్నికల అభ్యర్థి ఎంపిక, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి సంబంధించి ఉమ్మడిగా తీసుకోవాల్సిన కార్యాచరణలపై చర్చించినట్లు తెలుస్తోంది. అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలి సారిగా కాపు సామాజిక వర్గ నేతలతో సమావేశమయ్యారు. కులాలకు వర్గాలకు ప్రాంతాలకు అతీతంగా బ్రాడ్ మైండ్ తో పవన్ కల్యాణ్ ఆలోచనా విధానం ఉంటుంది అన్నది అందరికీ తెలిసిందే. అయినప్పటికీ రాజకీయాల్లో రాణించాలంటే కొన్ని వర్గాలను కూడగట్టుకోవాల్సిన అవసరం ఉందని భావించి ఈ సమావేశంలో పాల్గొని ఉంటారని భావిస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా చెప్పుకోవాల్సి ఏమటంటే సోము వీర్రాజు, పవన్ కల్యాణ్ ద్వయం రాబోయే ఎన్నికల నాటికి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో పాటు అధికార వైసీపీని గట్టిగా దెబ్బకొట్టాలని వ్యూహత్మక అడుగులు వేస్తున్నట్లు కనబడుతోంది.
Pawan Kalyan : బీసీ మంత్రం అందుకున్న బీజెపీ
ఈ క్రమంలోనే బీసీ మంత్రం కొత్తగా తెరపైకి తీసుకువచ్చారు సోము వీర్రాజు. జనాభాలో గానీ ఓటర్లలో సగ భాగం బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారనేది అందరికీ తెలిసిందే. గతంలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ బీసి వర్గీయులు వెన్నుదన్నుగా ఉండేవారు. అయితే గడచిన ఎన్నికల్లో మెజార్టీ బీసీ వర్గాలు వైసీపీకి టర్న్ అయ్యారు. రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెరగాలంటే ఒక్క హిందూత్వ ఎజెండాతో ముందుకు సాగితే అంతగా వర్క్ అవుట్ కాదని బీజెపీ – జనసేన కూటమికి అర్థం అయినట్లు ఉంది. బీసీలను ముఖ్యమంత్రి చేసే దమ్ము తమ పార్టీకి మాత్రమే ఉందని బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్య చేశారు. టీడీపీ గానీ వైసీపీ గానీ బీసీలను సీఎం చేయగలరా అంటూ ఛాలెంజ్ కూడా విసిరారు. ఆ పని బీజెపీ మాత్రమే చేయగలదని అన్నారు. ఇది ఒక కీలకమైన ప్రకటన కావడం వల్ల ముందుగా పవన్ కళ్యాణ్ తో ఈ విషయంపై సోము చర్చించి ఉంటారని అనుకుంటున్నారు. తొలి నుండి కూడా పవన్ కల్యాణ్ తాను ముఖ్యమంత్రి సీటు కోసం రాజకీయాల్లోకి రాలేదనీ, సమాజంలో మార్పు తీసుకురావడానికే వచ్చానని పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా సోము వీర్రాజు ఇదే సందర్భంలో మరో బాంబ్ కూడా పేల్చారు. బీజెపీలోకి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతాయని పేర్కొన్నారు. టీడీపీ, వైసీపీ నేతలు తమ పార్టీలో చేరనున్నారని సోము వ్యాఖ్యానించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు బీజేపీతో చర్చలు జరుపుతున్నారనీ, త్వరలోనే వారి పేర్లు కూడా వెల్లడిస్తామనిి ప్రధాన పార్టీలకు పెద్ద బాంబు వేశారు సోము వీర్రాజు. ఇప్పుుడ సోము చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.