జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి భీమవరంలో జరిగిన బహిరంగ సభలో వైసీపీ సర్కార్, సీఎం జగన్మోహనరెడ్డిపై నిప్పులు చెరిగారు. ఇటీవల సీఎం జగన్ చేసిన వ్యక్తిగత విమర్శలపైనా రియాక్ట్ అయ్యారు పవన్. తాను ప్రభుత్వ పాలసీలపై మాట్లాడుతుంటే .. వ్యక్తిగతంగా తనపై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. హైదరాబాద్ లో పెరిగిన సీఎం జగన్ వ్యక్తిగత జీవితం గురించి తాను మాట్లాడితే వైసీపీ నేతలకు చెవుల నుండి రక్తం వస్తుందన్నారు.
తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే తాను కూడా అదే పని చేయగలనంటూ హెచ్చరించారు. సీఎం జగన్ హైదరాబాద్ లో ఏం చేశారో, ఆయన మంత్రులు ఏం చేశారో అన్నీ తనకు తెలుసునన్నారు. వారి లోతైన విషయాలు కూడా తనకు తెలుసునని అన్నారు. వ్యక్తిగత విషయాలు తాను మాట్లాడలేక కాదనీ, తనకు సంస్కారం అడ్డువస్తుందన్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్, క్రిమినల్స్ అని జగన్ ఎగురుతున్నారేమో .. విప్లవ స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. చిల్లర మాటలు మాట్లాడితే ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసునని అన్నారు. వైసీపీ నేతలు నోటికి సైలెన్సర్లు బిగించుకోండని హెచ్చరించారు. గంజాయిని రాష్ట్ర పంటగా, గొడ్డలిని రాష్ట్ర ఆయుధంగా జగన్ రెడ్డి మార్చారని పవన్ దుయ్యబట్టారు.
ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీతో సై అంటే సై అని, ఒక్క సీటు కూడా వైసీపీకి రానివ్వమని అన్నారు. మద్య పాన నిషేదం అని చెప్పి ప్రభుత్వం దాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. మద్యం ధరల రూపేణా అధిక ధరలు వసూలు చేస్తూ ప్రజల పొట్ట కొట్టి, ఆ డబ్బుల్నే సంక్షేమ పథకాల రూపంలో ఇస్తున్నారని విమర్శించారు. రూ.40, రూ.70 రూపాయలు ఉండే మద్యం ఇప్పుడు రూ.150 , రూ.400 దాకా పెంచి కల్తీ మద్యాన్ని ఇస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్యాన్ని చిధ్రం చేసి ఆడ వారి పుస్తెలు తెంచి వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. సంపూర్ణ మద్యపాన నిషేదం అమలు చేయడం చాలా కష్టం కాబట్టి జనసేన ప్రభుత్వం వస్తే పాత ధరలకే మద్యాన్ని అమ్ముతామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో క్లాస్ వారు చేస్తున్నది ఎవరని ప్రశ్నించారు. క్లాస్ వార్ అనే పదం ఉచ్చరించే అర్హత కూడా జగన్ కు లేదని అన్నారు. పాతికేళ్ల పాటు ప్రజల కోసం కూలీగా పని చేయడానికి తాను రాజకీయాల్లోకి వచ్చానని, వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తారని ఆశిస్తున్నానన్నారు. జనసేన సత్తా ఏమిటో అసెంబ్లీలో చాలాటన్నారు. ఏది ఏమైనా సేవ, పోరాటం మాత్రం ఆపను అని స్పష్టం చేశారు. జనసేనకు ఓటమి గెలుపు ఉండవనీ, ప్రయాణమే ఉంటుందన్నారు. బీసీలకు సంపూర్ణ రాజ్యాధికారం రావాలనీ, దళితులు పారిశ్రామిక వేత్తలు కావాలనీ, అగ్రవర్ణాల్లోని పేదలకు ఆర్ధిక సాయం చేసేందుకు అండగా ఉంటామని తెలిపారు. సీఎం జగన్ జిల్లాల పర్యటనకు వస్తుంటే చెట్లను కూడా కొట్టేస్తున్నారనీ, వైసీపీ పాలనలో చెట్లు కూడా మౌన పోరాటం చేస్తున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో వ్యవస్థలు నాశనమయ్యాయని దుయ్యబట్టారు.
Breaking: ఈటల రాజేందర్ కు వై ప్లస్ సెక్యురిటీ