Rajampeta: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పొలిటికల్ సీజన్ అయితే మొదలు కాలేదు కానీ పార్టీలు, పార్టీల అధినేతలు, కార్యకర్తలు పొలిటికల్ సీజన్ వచ్చేసినట్లుగానే భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల గడువు ఇంకా రెండేళ్లకుపైగా ఉన్నప్పటికీ ముందుస్తు ఎన్నికలు వస్తే ఏడాదిన్నర లోపే రావచ్చు అన్న భావనతో అందరూ పొలిటికల్ మూడ్ లోకి వెళ్లిపోయారు. అందుకే నెల రోజుల తరువాత సీఎం జగన్మోహనరెడ్డి కూడా రచ్చబండ – 2 పేరిట జనాల్లో ఉండేందుకు ప్రణాళికలు వేస్తుంటే టీడీపీ నుండి చంద్రబాబు గానీ లోకేష్ గానీ ఓ పాదయాత్ర గానీ, రధయాత్ర గానీ చేయాలని ప్లాన్ వేసుకుంటున్నారు. ఈలోగా నియోజకవర్గాల వారీగా ఎవరు అభ్యర్ధులు అవుతారు, ఎవరు పోటీ చేస్తారు అనే వాటిపై ఊహాగానాలు, పుకార్లు వినబడుతున్నాయి. కడప జిల్లాకు సంబంధించి ఓ కీలకమైన విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది.
రాజంపేట ఎంపీ స్థానానికి
కడప జిల్లాలో కడప, రాజంపేట రెండు పార్లమెంట్ స్థానాలు స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ బాగా వెనుకబడే ఉంది. ఒక వేళ టీడీపీ బాగా బలపడితే మూడు అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. వైసీపీ చాలా సునాయాసంగా ఏడు లేదా 8 స్థానాలు గెలుచుకుంటుంది. ఈ జిల్లాలో ఎంపీ స్థానం టీడీపీ గెలవాలంటే అసాధ్యమనే చెప్పవచ్చు. రాజంపేట ఎంపీగా వరుసగా మిథున్ రెడ్డి రెండు సార్లు గెలిచి ప్రస్తుతం ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు అనూహ్యమైన సమీకరణం బయటకు వస్తోంది. కడప జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఒక కీలక నేత రాబోయే ఎన్నికలకు రాజంపేట ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్ధి అవ్వనున్నారని వార్తలు వినబడుతున్నాయి.
Rajampeta: వైసీపీ ఎమ్మెల్యే పార్టీ మారతారంటూ పుకార్లు
ప్రస్తుతం ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఓ గ్రూపు ఉంది. ఈ గ్రూపుకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి మాజీ ఎమ్మెల్యే కాగా ఆయనకు జిల్లా స్థాయిలో మంచి పట్టు కూడా ఉంది. జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుడు అనే పేరు ఉంది. ఆ ఎమ్మెల్యే ఎన్నికలకు ముందే పార్టీలో చేరడం, ఆయన పార్టీలో అడ్జెస్ట్ కాలేకపోవడం, నియోజకవర్గ స్థాయిలో ఉన్న గ్రూపులను పార్టీ చక్కదిద్దకపోవడం, మరో వైపు తన వర్గీయులపై వత్తిళ్లు, ఇలా గ్రూపుల వద్ద ఆ ఎమ్మెల్యేకి తలనొప్పి ఎదురువుతోంది. అందుకే ఆయన పార్టీ మారిపోతారేమో అని కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి. అక్కడ స్థానికంగా ఈ విషయాలు వినబడుతున్నా ఇది వాస్తవం కాదని కూడా అంటున్నారు. ఇది జరిగే అవకాశాలు లేవనే అనుకుంటున్నారు.
Rajampeta: పుకార్లు ఖండిస్తున్న ఎమ్మెల్యే
ఒక వేళ ఆ ఎమ్మెల్యే పార్టీ మారి రాజంపేట ఎంపీ స్థానం నుండి పోటీ చేస్తే రెండు మూడు నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుందని సమాచారం. గతంలో ఆ నేత టీడీపీలో ఉండే వారు. వైసీపీలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. వాస్తవానికి పార్టీ నుండి వెళ్లిన వాళ్లను మరల టీడీపీలోకి రావడానికి ఆ పార్టీ శ్రేణులు స్వాగతించడం లేదు. కానీ ఈ నాయకుడు రాకను స్వాగతిస్తున్నట్లు సమాచారం. టీడీపీ శ్రేణులు మాత్రం ఆయన చేరితే బాగుంటుంది అని భావిస్తూ ఆహ్వానిస్తున్నారు. ఆయన మాత్రం పార్టీ మారే ప్రసక్తిలేదని స్పష్టం చేస్తున్నారుట. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదు, పార్టీలోని గ్రూపులను పార్టీ సెట్ రైట్ చేస్తుందని చెబుతున్నారుట. అయితే ఆయన అనుచరులు మాత్రం పార్టీలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.