Revanth Reddy: ఆంధ్రప్రదేశ్ లోనూ తమ పాలన కోరుకుంటున్నారని తెలంగాణ సీఎం కేసిఆర్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ప్లీనరీలో కేసిఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన తరువాత ఆంధ్రా ప్రాంతం నుండి వందలు, వేల మంది ఏపిలో మన పార్టీ పెట్టాలని కోరుతున్నారు, మీరు పెడుతున్న పథకాలు మాకు కావాలి, మీ పార్టీ పెడితే గెలిపించుకుంటాం అని చెబుతున్నారని కేసిఆర్ అన్నారు. కేసిఆర్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఏపి సమాచార శాఖ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో ప్రకంపనలు రేపాయి. వందలాది మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పాటు అయ్యింది. ఇప్పుడు మళ్లీ ఏపి, తెలంగాణ రాష్ట్రాలను కలిపేద్దాం, సమైక్యంగా ఉందాం అంటే అసలే ప్రాంతీయ సెంటిమెంట్ అధికంగా ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలు, అక్కడి నాయకులు ఊరుకుంటారా. వెంటనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీరియస్ గా స్పందించారు.
Revanth Reddy: ఏపి, తెలంగాణ కలిపేలా అసెంబ్లీలో తీర్మానాలు చేద్దాం
కేసిఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపి మంత్రి పేర్ని నాని ఏమన్నారంటే .. కేసిఆర్ ఏపిలో ప్రత్యేకంగా పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు, రెండు రాష్ట్రాలను కలిపేలా ఇక్కడ అక్కడ అసెంబ్లీలో తీర్మానాలు చేస్తే బాగుంటుంది, రాష్ట్రం సమైక్యంగా ఉండిపోతుంది, అక్కడ ఇక్కడ పోటీ చేయవచ్చు అని నాని అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ గతంలోనూ సమైక్యంగా రాష్ట్రం ఉండాలని కోరుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సమైక్య రాష్ట్ర ప్రతిపాదన కేసిఆర్ – జగన్ కుట్ర
దీనిపై టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. వందల మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. అలాంటి తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు రేవంత్ రెడ్డి. కేసిఆర్ రాజ్య విస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ప్లీనరీలో తెలుగు తల్లి ప్రత్యక్షం కావడం, మంత్రి పేర్ని నాని సమైక్య రాష్ట్ర ప్రతిపాదన తీసుకురావడం కేసిఆర్, జగన్ ఉమ్మడి కుట్రలో భాగమని రేవంత్ మండిపడ్డారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేస్తూ కేసిఆర్, నానిల కామెంట్ల వీడియోను షేర్ చేశారు.
హాట్ హాట్ గా మారిన నాని వ్యాఖ్యలు
ఏపి మంత్రి నాని చేసిన వ్యాఖ్యలు ఇటు ఆంధ్రప్రదేశ్ లో,. అటు తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపికి ఎలాగూ రాజధాని లేదు. విశాఖలో రాజధాని ఏర్పాటు ఇప్పట్లో అయ్యేలా కనబడటం లేదు. ఇప్పుడు ఏపి, తెలంగాణను కలిపేస్తే అటు రాజధాని సమస్య తీరిపోతుంది. జల జగడం తొలగిపోతుందని ఏపి నుండి కామెంట్స్ వినబడుతుండగా, తెలంగాణలో మాత్రం ఏపి మంత్రి నాని వ్యాఖ్యలకు గరం గరం అవుతున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను ఏపితో మళ్లీ కలవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.