Rushikonda: విశాఖ రిషికొండ పై తవ్వకాల అంశం ఏపిలో హాట్ టాపిక్ గా మారింది. రుషికొండపై తవ్వకాలు, నిర్మాణాలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి. రుషికొండపై జరిగే నిర్మాణాలకు సంబంధించి ఇటు ఎన్జీటీలో, అటు కోర్టుల్లో విచారణ జరుగుతున్నాయి. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి రుషికొండపై పచ్చని కొండను చుట్టూ తవ్వేసి చెట్లు నరికేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సెవెన్ స్టార్ అభివృద్ధి పేరుతో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మాణాలు చేపడుతుండగా, ఎన్జీటీలో రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు గతంలో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్జీటీ స్టే ఉత్తర్వులు జారీ చేసింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Rushikonda: టీడీపీ నేతల అరెస్ట్
ఈ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఎన్జీటీ ఉత్తర్వులను సవరించింది. గతంలో నిర్మాణాలు ఉన్న స్థలంలోనే నిర్మాణాలు చేసుకోవడానికి అనుమతి ఇస్తూ కొండపై వేరే ప్రదేశంలో కొత్త నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించింది. ఈ పిటిషన్ పై విచారణను హైకోర్టుకు బదిలీ చేసింది. ఇదే నేపథ్యంలో రుషికొండలో తవ్వకాలపై ఎన్జీటీలో మరో పిటిషన్ దాఖలైంది. ఇదిలా ఉండగా నేడు రుషికొండపై పర్యావరణ మానవహారానికి టీడీపీ పిలుపు ఇచ్చింది. అయితే దీనికి అనుమతి లేదంటూ టీడీపీ ఎమ్మెల్సీ రామారావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పలువురు టీడీపీ నేతలను ముందస్తు అరెస్టు చేశారు.
అయినప్పటికీ టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణతో సహా పలువురు టీడీపీ శ్రేణులు రుషికొండలో తవ్వకాలు జరిగే ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. మాజీ మంత్రి బండారు సత్యనారాయణతో సహా టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఇటీవల బీజేపీ నేతలు రుషికొండ పర్యటనకు వెళ్లేందుకు ప్రయత్నించినా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీనిపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నర్శింహరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు.