భూమా అఖిలప్రియ .. రాజకీయాల్లో తీసుకున్న నిర్ణయాలతో ఎంతగా చర్చల్లో నిలిచారో అంతకంటే ఎక్కువగా తాజాగా హైదరాబాద్ బోయిన్పల్లి కిడ్నాప్ కేసుతో వార్తల్లోకి ఎక్కారు.
ఈ కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ స్ట్రాంగ్ గా దొరికిపోయారనే టాక్ వస్తోంది. అఖిలప్రియ అనుచరులు కిడ్నాప్ కేసులో సీసీ కెమెరాల్లో చిక్కారని, వారిని విచారిస్తే, కిడ్నాప్ స్కెచ్, ప్లాన్, రెక్కీ, అమలు అంతా భార్యాభర్తలదే అని పోలీసుల విచారణలో తేలినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో అఖిలప్రియ భర్త A3 భార్గవ్ రామ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. దీంతో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలోఅఖిలప్రియ సోదరి సంచలన కామెంట్లు చేశారు.
అఖిలప్రియ గేమ్ ప్లాన్ ….
కిడ్నాప్ కేసులో అఖిలప్రియ పాత్ర స్పష్టంగా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అయితే, తన ఆరోగ్యం బాగోలేదని బెయిల్ ఇవ్వాలని… అఖిలప్రియ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఉస్మానియా వైద్య పరిక్షల్లో అఖిలప్రియ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. దీంతో ఓ వైపు అఖిలప్రియ పాత్ర మరోవైపు ఆమె ఆరోగ్యం నేపథ్యంలో ఈ మాజీ మంత్రి బయటకొస్తే సాక్షులను బెదిరించవచ్చని పోలీసుల కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. నేడు కోర్టులో అఖిలప్రియ బెయిల్, కస్టడి పై విచారణ జరుగనుంది.
అఖిలప్రియ పై భారీ కుట్ర ?
మరోవైపు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరి మౌనికారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిలప్రియ పై భారీ కుట్ర జరుగుతోందని ఆమె వెల్లడించారు. త్వరలోనే కేంద్ర హోం శాఖ మంత్రి కిషన్ రెడ్డి ని కలుస్తామని పేర్కొన్నారు. ఒక్కొక్కరి పేర్లు బయటపెడతామని భూమా మౌనికా రెడ్డి ప్రకటించారు. కాగా, కేంద్ర హోం శాఖ సహాయం మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావొచ్చనే ఉద్దేశంతోనే భూమా మౌనికారెడ్డి ఈ మేరకు కామెంట్లు చేసి ఉంటారని పలువురు అంచనా వేస్తున్నారు. అయితే, సౌమ్యుడు, వివాదరహితుడు అనే పేరున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ రచ్చలో జోక్యం చేసుకుంటారా? అంటే సమాధానం సందేహమే. ఇలాంటి తరుణంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నమ్మినబంటును భూమా కుటుంబం తమ వివాదంలో ఎలా నమ్ముకుంటుందో? వారికే తెలియాలి.