Chandrababu: ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు (supreme Court) మరో సారి వాయిదా వేసింది. ఈ కేసును జనవరి 17వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం .. కేసుకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబును ఆదేశించింది. ఇరుపక్షాలూ సంయమనం పాటించాలని సుప్రీం కోర్టు సూచించింది.
ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే స్కిల్ కేసులో 17ఏ పై తీర్పు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో విచారణ పలు మార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇవేళ సుప్రీం కోర్టులో జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందు ఫైబర్ నెట్ కేసు విచారణకు వచ్చింది. స్కిల్ కేసులో 17ఏ పై తీర్పు వెలువరించాల్సి ఉన్నందున ఫైబర్ నెట్ కేసును జనవరి 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. అంత వరకూ చంద్రబాబుపై ఎటువంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం ఆదేశించింది.
ఈ సమయంలో కేసు విషయాలపై చంద్రబాబు బహిరంగంగా మాట్లాడుతున్నారంటూ ప్రభుత్వ తరపు న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు. జైలుకు పంపిన విషయాలపైనా ఆయన మాట్లాడుతున్నారని చెప్పారు. ఈ కేసుపై చంద్రబాబు బహిరంగంగా మాట్లాడకుండా ఆంక్షలు విధించాలని ప్రభుత్వ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. అనంతరం చంద్రబాబు తరపు న్యాయవాది సిద్దార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబు కోర్టు నిబంధనలకు విరుద్దంగా మాట్లాడలేదని తెలిపారు.
ప్రభుత్వం తరపునే ఢిల్లీ సహా పలు ప్రదేశాల్లో ఆదనపు ఏజీ, సీఐడీ డీజీ మీడియా సమావేశాలు నిర్వహించారన్నారు. వారు ప్రెస్ మీట్ నిర్వహించడం పూర్తిగా తప్పని చెప్పారు. మీడియా సమావేశాల్లో నిరాధార ఆరోపణలు చేశారనీ, వాటితో పోలిస్తే చంద్రబాబు ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని సిద్ధార్ధ లూథ్రా కోర్టుకు తెలిపారు. కేసు గురించి ఎవరేం మాట్లాడారో అఫిడవిట్ దాఖలు చేయాలని ఇరుపక్షాల న్యాయవాదులను ధర్మాసనం ఆదేశిస్తూ.. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని ధర్మాసనం సూచించింది.
AP High Court: కోర్టు ఆదేశాల దిక్కరణ .. గుంటూరు మున్సిపల్ కమిషనర్ కు జైలు శిక్ష