Tdp: రాష్ట్ర రాజకీయాలకు ప్రముఖమైన జిల్లాల్లో ఒకటి గుంటూరు. ఇక్కడ మొదటి నుంచీ టీడీపీ ప్రాబల్యం ఎక్కువ. అయితే.. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మ్యానియాలో మొత్తం 18 నియోజకవర్గాలకు గానూ.. 16 కాంగ్రెస్ గెలిస్తే.. ఒక కాంగ్రెస్ రెబల్, టీడీపీ ఒక్క సీటు పొన్నూరులో గెలుచుకుంది. 2019లో వైసీపీ హోరులో 17 స్థానాల్లో 2 సీట్లు టీడీపీ గెలచుకుంది. ప్రస్తుతం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు 15 మంది ఉన్నా టీడీపీ బలగం తక్కువేమీ కాదు. టీడీపీకి మొదటి నుంచీ కృష్ణా, గుంటూరు జిల్లాలు కంచుకోటలుగానే చెప్పాలి. దీంతో గత ఎన్నికల్లో తమ పట్టు కోల్పోయిన గుంటూరు జిల్లాపై టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. స్థానిక నాయకత్వాన్ని పటిష్టం చేయడం ద్వారా అధినేత చంద్రబాబు అక్కడ టీడీపీని బలోపేతం చేస్తున్నారు.
అక్కడ టీడీపీ బలంగా..
ముఖ్యంగా పశ్చిమ గుంటూరు జిల్లాగా పేరున్న పల్నాడు ప్రాంతంలో సత్తెనపల్లి, నరసారావుపేట, గురజాల, వినుకొండ చాలా ముఖ్యమైనవి. గురజాలలో కాసు మహేశ్ రెడ్డి, వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు, నరసారావుపేటలో గోపిరెడ్డి, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు, మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ వైసీపీ హవానే కొనసాగుతోంది. అయితే.. ఇప్పుడు అక్కడ టీడీపీ ఏమైనా బలపడిందా అంటే కొంత ప్రశ్నార్ధకమే అని చెప్పాలి. పైపెచ్చు మాచర్లలో ఇటివల రాజకీయ అలజడి ఎక్కువగా ఉంది. (Tdp) టీడీపీ అక్కడ బాగా ఇబ్బంది పడుతుందనే చెప్పాలి. అయితే.. టీడీపీ అధిష్టానం ఇటివల మాచర్ల ఇంచార్జిగా బ్రహ్మానందరెడ్డికి పగ్గాలు ఇచ్చింది. దీంతో అక్కడ పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చిందనే చెప్పాలి.
ధీటుగా వైసీపీ..
నరసారావుపేటలో టీడీపీ ఇంచార్జి అరవిందబాబుపై దాడి జరగడం కూడా టీడీపీకి పాజిటివ్ అయిందనే చెప్పాలి. కోడెల ఆధిపత్యం కొనసాగే చోట అరవింద్ బాబు కాస్త ఫేమస్ అయ్యారు. సత్తెనపల్లిలో రాయపాటి రంగారావు, గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు, వినుకొండలో జీ.వీ ఆంజనేయులు.. వీరంతా యాక్టివ్ కావడంతో టీడీపీ మళ్లీ తన సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. 2024 ఎన్నికల్లో వైసీపీని ఓడించి గెలవాలనే ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటి నుంచే (Tdp) టీడీపీ అడుగులు వేస్తోంది. అయితే.. ప్రస్తుతం అక్కడ వైసీపీ బలంగా ఉంది. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో.. ఎవరు పుంజుకుంటారో చూడాల్సి ఉంది.