AP CM YS Jagan: ఏపిలో గత కొద్ది రోజులుగా టీడీపీ నేతలపై కేసులు నమోదు, అరెస్టులు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరో పక్క రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎప్పుడు ఏ టీడీపీ నేతపై కేసులు నమోదు చేస్తారో, ఎవరిని అరెస్టు చేస్తారో అన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఉంది. ఒక పక్క టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై ఏపి సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ కు హజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు. మరో పక్క సంగం డైరీ అవినీతి వ్యవహారాలపై టీడీపీ సీిినియర్ నేత దూళిపాళ నరేంద్ర ను అరెస్టు చేసి జేైలుకు తరలించారు. అదే విధంగా ఎన్ ఆర్ ఐ ఆసుపత్రి యాజమాన్యాన్ని బెదిరించారన్న అభియోగంపై మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పై కేసు నమోదు చేశారు. ఇంకా పలువురు టీడీపీ నేతలకు గత కేసులకు సంబంధించి నోటీసులను పోలీసులు అందజేస్తున్నారు.
ఈ పరిణామాలను పురస్కరించుకుని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు జగన్ సర్కార్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మొత్తం కరోనా పై పోరాటం చేస్తుంటే ఏపి సీఎం జగన్ మాత్రం రాజకీయ పోరు సాగిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కరోనా కట్టడి చర్యల్లో సీఎం వైఎస్ జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జగన్ నిర్లక్ష్యం వల్లనే రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. నిత్యం వేల సంఖ్యలో కేసులు పెరుగుతుంటే జగన్ తూతూ మంత్రంగా సమీక్షలు నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు బెడ్లు కూడా దొరకని పరిస్థితి ఉందని, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కోవిడ్ ఆసుపత్రులను ప్రభుత్వం పెంచలేదన్నారు. క్వారంటైన్ కేంద్రాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేని విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని కరోనా కట్టడిపై దృష్టి పటిష్ట చర్యలు చేపట్టాలని అచ్చెన్నాయుడు సూచించారు.