TS High Court: ఏపీ సీఎం జగన్ పై కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని, 2024 సాధారణ ఎన్నికలకు ముందే తీర్పు వెలువరించాలని, ఆ మేరకు సీబీఐ కోర్టుకు ఆదేశించాలని మాజీ ఎంపీ హరేరామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిల్ పై రిజిస్ట్రీ అభ్యంతరాలు లేవనెత్తి, నంబర్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఫైలింగ్ నంబర్ పైనే ఇవేళ విచారణ మొదలైంది. ఈ సందర్భంలో పిటిషనర్ పై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఇలాంటి పిటిషన్లు వేసి కోర్టు విలువైన సమయాన్ని వృధా చేసేందుకు యత్నించారంటూ మండిపడింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం.

పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలకు సిద్దం కాగా, ఆ వెంటనే ధర్మాసనం కలుగుజేసుకుంది. “ఇదో పబ్లిక్ న్యూసెన్స్. ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముంది అసలు. వ్యక్తిగత కక్షతోనే పిల్ దాఖలు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తొంది. ఓ మాజీ ఎంపీ అయి ఉండి మీరు ఇలా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదు” అని తెలిపింది. “రాష్ట్రపతికి లేఖ రాశాం. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాం.. అని అంటారా.. ఇది ఏమి పద్ధతి.. ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి చెప్పినంత మాత్రాన కింది స్థాయి కోర్టు భయపడి పని చేయవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓ బాధ్యత గల మాజీ పార్లమెంట్ సభ్యుడైన మీరు ఇలా వ్యవహరించడం ఆమోద యోగ్యం కాదు” అని వ్యాఖ్యానించింది.
“మీరు దాఖలు చేసిన పిటిషన్ లో అసలు ఎక్కడన్నా ప్రజాఆసక్తి ఉంది అని మీకైనా అనిపిస్తొదా..? వ్యక్తిగత ద్వేషంతో కోర్టులను ఆశ్రయించి .. మా విలువైన సమయాన్ని వృధా చేయవద్దు, ఈ మధ్య తెలంగాణ గవర్నర్ చెప్పినట్లు ఇలాంటి పబ్లిక్ న్యూసెన్స్ కేసులు ఎక్కువ అయ్యాయి. కొందరికి ఇలాంటి పిటిషన్లు వేయడమే పరిపాటిగా మారింది. మీరు అడిగారు కదా అని వెంటనే విచారణ చేపట్టలేము” అని ధర్మాసనం పిటిషనర్ కు స్పష్టం చేసింది. రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తిన అంశాలు కాపీని పిటిషనర్ కు ఇవ్వాలని ఆదేశించిన ధర్మాసనం .. విచారణను జూలై 6కు వాయిదా వేసింది.
జగన్ నోటి వెంట కొత్త మాట .. నడ్డా, షా వచ్చి వెళ్లిన తర్వాత..