ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు ప్రభుత్వ పథకాలను ప్రారంభిస్తున్న సమయంలో చంద్రబాబు, దత్తపుత్రుడు, వారికి సహకరించే మీడియా, దుష్టచతుష్టయం అంటూ విమర్శలు, ఆరోపణలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఏపీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు ఏపీకి వచ్చి జగన్మోహనరెడ్డి సర్కార్ పై ఆరోపణలు, విమర్శలు చేసి వెళ్లిన తర్వాత ఆయన విమర్శల్లో మరో కొత్త మాట చేరింది. మీ జగనన్నకు బీజేపీ అండగా ఉండకపోవచ్చు అని జగన్ పేర్కొనడం గమనార్హం. జేపీ నడ్డా, అమిత్ షా తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై ఆరోపణలు చేసినా జగన్ మాత్రం వాటిపై కౌంటర్ విమర్శలు చేయలేదు. పూర్తి స్థాయిలో బీజేపీ దూరమైనట్లుగా జగన్ భావించలేదేమో అందుకే బీజేపీ అండగా ఉండకపోవచ్చు , అయినా తాను వాళ్లను నమ్ముకోలేదు అని మాత్రం అన్నారు జగన్.
పల్నాడు జిల్లా క్రోసూర్ లో జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యాకానుక అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యార్ధులకు విద్యాకానుక కిట్ లు ఇస్తున్నాని తెలిపారు. కిట్లలో మెరుగైన మార్పులు తెచ్చామన్నారు. ప్రతి విద్యార్ధికీ మూడు జతల యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, షూస్, సాక్సులు అందిస్తున్నామన్నారు. నోట్ బుక్స్, వర్క్ బుక్స్, బైలింగువల్ పాఠ్య పుస్తకాలు, డిక్షనరీలతో పాటు బ్యాగ్ సైజులు పెంచామన్నారు. యూనిఫామ్ డిజైన్ లోనూ మార్పులు చేశామని చెప్పారు. వీళ్లు చిన్నారులు, వీళ్లకు ఓటు హక్కు లేదు.. పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది గతమనీ, కానీ ఇవేళ వాళ్ల జగన్ మామ ప్రభుత్వంలో విద్యాకానుక ఓ పండుగలా జరుగుతోందన్నారు.
ఒక ఎమ్మెల్యే దగ్గర నుండి ప్రతి ప్రజా ప్రతినిధులందరూ పిల్లలతో కలిసి ఈ పండుగలో పాల్గొంటుడటం ఆ పిల్లల మేనమామగా సంతోషపడుతున్నానని సీఎం జగన్ అన్నారు. ఈ పథకం కింద ఈ నాలుగేళ్లలో రూ.3,336 కోట్లు ఖర్చు చేశామని చెప్పడానికి గర్వపడుతున్నానన్నారు. ఈ ఏడాది 43,10 లక్షల మంది విద్యార్ధులకు 1,042,53 కోట్ల వ్యయంతో విద్యాకానుక అందిస్తున్నామన్నారు. ప్రతి విద్యార్ధికీ రూ.2,600 విలువైన కిట్ లు అందిస్తున్నామని తెలిపారు. ప్రపంచాన్ని ఏలే పరిస్థితిలో మన విద్యార్ధులు ఉండాలనీ, అందుకే టోఫెల్ పరీక్షలకు సిద్దం చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఈ ఏడాది నుండే అమలు చేస్తామనీ, ఇందు కోసం అమెరికాకు చెందిన సంస్థతో ఒప్పందం చేసుకున్నామన్నారు.
ఇదే సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో సారి విమర్శలు గుప్పించారు. పెదల పిల్లల చేతిలో ట్యాబులు కనిపిస్తే ఓర్వలేని బుద్ది చంద్రబాబుదని అన్నారు. చంద్రబాబుకు మంచి చేయాలనేది ఏనాడు లేదన్నారు. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నా కూడా ఏ ఒక్క మంచి, పథకం కూడా గుర్తుకు రాదన్నారు. చంద్రబాబు ఏ ఒక్క వర్గాన్ని కూడా వదలకుండా అందరినీ మోసం చేశాడని విమర్శించారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గుర్తించాలని, అవినీతి, వివక్షకు తావులేకుండా నేరుగా లబ్దిదారులకు సంక్షేమం అందించిన ప్రభుత్వం మనది అని అన్నారు. సీఎం అయిన 28 సంవత్సరాల తర్వాత .. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత రాయలసీమ, బీసీ, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లు అంటూ ఇవేళ మొదలు పెట్టాడనీ, ఆ 14 సంవత్సరాలు ఏం గాడిదలు కాసావా చంద్రబాబు అంటూ నిలదీశాడు సీఎం జగన్.
ఆశ ఉండవచ్చు .. కల కనవచ్చు .. కానీ ..ఇంతనా..?