రాజకీయ పార్టీల నాయకులు ఆశ పడవచ్చు.. కల కనవచ్చు.. కానీ ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురాతానన్నట్లు .. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. గత ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో ఒక్క అసెంబ్లీ స్థానంలోనూ డిపాజిట్లు సాధించిన దాఖలాలు లేవు..పై పెచ్చు కొన్ని నియోజకవర్గాల్లో నోటా కంటే తక్కువగా బీజేపీ అభ్యర్ధులకు ఓట్లు వచ్చిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంట్ స్థానాల్లో 20 సీట్లు ఇవ్వాలని ప్రజలను బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోరారు అంటే .. ఆశకు హద్దు లేదా అని సామాన్యులు ఎవరైనా అంటారు. ప్రధాన రాజకీయ పార్టీలతో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలో నిలిస్తే ఒక్క అసెంబ్లీ స్థానం కూడా గెలుచుకోలేని పరిస్థితి ఉన్న ఏపి బీజేపీలో 20 లోక్ సభ స్థానాలకు ఎలా ఆశపడుతున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.
మోడీ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై ఆదివారం విశాఖ రైల్వే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా ముఖ్య అతిధిగా హజరై ప్రసంగించారు. అంతకు ముందు రోజు శ్రీకాళహస్తిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించారు. ఈ ఇద్దరు నేతలు ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేశారు. జగన్ పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్ప ఎలాంటి అభివృద్ధి లేదని విమర్శించారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రభుత్వంపై ఇలాంటి విమర్శలే చేశారు మోడీ, షా. కేంద్రంలో తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ ..నాడు చంద్రబాబు, ఇప్పుడు జగన్ అవినీతి, కుంభకోణాలు జరిపితే వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్న సామాన్య ప్రజల నుండి వినబడుతుంది.
నాడు పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంగా వాడుకున్నారని ప్రధాని మోడీనే విమర్శించారు. ఆ తర్వాత దానిపై విచారణ కూడా లేదు. ఎన్నికల సమయంలో ఇలాంటి రాజకీయ విమర్శలు చేయడం వల్ల ప్రజలు ఎవ్వరూ నమ్మే పరిస్థితి ఉండదు వారికీ తెలుసు. తొమ్మిదేళ్లలో మోడీ సర్కార్ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వివరించిన అమిత్ షా.. మోడీ వచ్చాకనే మన దేశం ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోందన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మోడీ నినాదమే వినిపిస్తొందన్నారు. 300 సీట్లతో మరో సారి మోడీ ప్రధాని కావడం ఖాయమనీ, ఏపి నుండి 20 లోక్ సభ స్థానాలు బీజేపీ గెలవాలని అమిత్ షా అన్నారు.
BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు ..? బండి సంజయ్ ఇచ్చిన క్లారిటీ ఇది..