Nara Lokesh: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తొలి సారిగా సీఐడీ విచారణను ఎదుర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ నోటీసులు ఇవ్వడం, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇవేళ లోకేష్ మంగళగిరి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం పది గంటల నుండి సాయంత్రం 5 గంటలకు వరకూ లోకేష్ ను సీఐడీ అధికారులు విచారించారు. మధ్యలో గంట పాటు లంచ్ బ్రేక్ ఇచ్చిన అధికారులు రింగ్ రోడ్డు స్కామ్ పై పలు ప్రశ్నలు సంధించారు. అయితే విచారణ ఇంకా ముగియలేదని, రేపు కూడా హాజరు కావాలని సీఐడీ అధికారులు తెలిపారు. దాదాపు 50 ప్రశ్నలను సీఐడీ అధికారులు లోకేశ్ కు వేసినట్లు తెలిసింది.
విచారణకు సహకరించకపోవడంతో తిరిగి రేపు మరో సారి విచారణకు రావాలని సీఐడీ అధికారులు కోరారని అంటున్నారు. తొలి రోజు విచారణ అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ .. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు తో సంబంధం లేని 50 ప్రశ్నలు అడిగారన్నారు. ఒకే ప్రశ్న ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి మంత్రి వర్గ ఉప సంఘం ముందుకు ప్రతిపాదన వచ్చిందా అని అడిగారన్నారు. గూగుల్ లో దొరికే సమాధానాలే తనను అడిగినట్లు చెప్పారు. హెరిటేజ్ కు సంబంధించి 49 ప్రశ్నల వరకూ అడిగారన్నారు.
ఇది కక్ష సాధింపు తప్ప మరొకటి కాదని స్పష్టమవుతోందని అన్నారు లోకేష్. తాను, చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నా ఈ రోజే ఎంత సమయం అయినా ఉంటానని చెప్పినా మళ్లీ రేపు రావాలంటూ 41 ఏ నోటీసు ఇచ్చారని లోకేష్ తెలిపారు. తనకు రేపు వేరే పనులు ఉన్నాయని చెప్పినా రేపు ఉదయం 10 గంటలకు రావాలని చెప్పారనీ, ఖచ్చితంగా రేపు విచారణకు హజరవుతానని లోకేష్ తెలిపారు.
YS Viveka Case: వైఎస్ భాస్కరరెడ్డికి సీబీఐ కోర్టులో మరో సారి ఊరట .. ఎస్కార్ట్ బెయిల్ పొడిగింపు